(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఒడిషాలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ వైపునకు కదులుతోందని తెలిపారు. ఇది తీరం దాటేందుకు మరో రెండు నుంచి మూడు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.