అమరావతి, మార్చి 9: విశాఖ జిల్లా సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు రత్నాకర్తో కలిసి పార్టీలో చేరారు. వీరికి జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు.
అనంతరం దాడి వీరభద్రరావు మిడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని విమర్శించారు. చంద్రబాబు పరిపాలన గాలికి వదిలివేశారని దాడి అన్నారు. మరో సారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారని దాడి విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు విజయసాయి రెడ్డి, ఆవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దాడి వీరభద్రరావు అనకాపల్లి నియోజకవర్గం నుండి 1989నుండి టిడిపి తరపున మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అనంతరం ఎమ్మోల్సీగా ఆరేళ్లు బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తరువాత వైసిపిలో చేరారు. 2014 ఎన్నికల తరువాత టిడిపిలో చేరారు. నేడు మళ్లీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.