ఇటీవలే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి దశ తిరగబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
2014లోనే ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు ఆ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి.ఆ ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది అయితే ఆమె ఓడిపోయారు.ఇక గెలవనని తెలిసి కూడా ఆమె పార్టీ కోసం నిన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేసి భంగపడ్డారు. మొత్తం మీద పురందరేశ్వరి బిజెపికి విధేయంగానే ఉంటూ వచ్చారు. ఆ పార్టీలో మంచి రోజుల కోసం ఎదురుచూస్తుండగా ఇన్నాళ్ళకు ఆమె టైం వచ్చింది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎలాగంటే ఏపీ పై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టింది. రేపటి ఎన్నికల్లో తన మార్క్ మ్యాజిక్ చూపించాలని బిజెపి తహతహలాడుతోంది.
ఈ నేపథ్యంలోనే కులాల సమీకరణకు ఆ పార్టీ కసరత్తు చేసింది. కాపులను కమ్మ సామాజిక వర్గాన్ని సరిచేసుకుంటే అధికార పీఠానికి చేరువ కావచ్చన్నది బిజెపి లెక్కలట. దీన్ని పరిగణలోకి తీసుకొని ఉత్తరాంధ్రలో కాపులను ఆకట్టుకోవడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ని ఏపీ బిజెపి అధ్యక్షుడిని చేశారు. దక్షిణ కోస్తాలో బాగా బలంగా ఉండే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి దగ్గుబాటి పురంధరేశ్వరి కి జాతీయ స్థాయి పార్టీ పదవి ఇచ్చారట.కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న క్రిష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు వంటి చోట్ల ఎన్టీయార్ వారసురాలు అయిన పురందరేశ్వరి తనదైన మ్యాజిక్ చేస్తారని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో చిన్నమ్మ మీద పెద్ద బాధ్యతలే పెట్టారు.నిజానికి టీడీపీ నుంచి చేరిన సుజనా చౌదరి లాంటి వారు బీజేపీలో ఉన్నా కూడా ఎన్టీయార్ లెగసీని తిప్పుకోవడానికే చిన్నమ్మకు ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరి ఎప్పటినుంచో కలలు కంటున్న రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి ఆమెకు వచ్చినా ఆశ్చర్యంలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పురంధరేశ్వరిని బాగా వాడుకోవడానికి సిద్ధపడ్డ బిజెపి ఆ మేరకు ఆమెకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారని వారు విశ్లేషిస్తున్నారు. బీజేపీ రాజకీయం అలాగే ఉంటుంది. రాజ్యసభ సభ్యుడు అయ్యేవరకు ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు ఎవరో ఈ ప్రాంతానికే తెలియదు. కాబట్టి చిన్నమ్మ ఆశలు బిజెపిలో నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పవచ్చు.