తమిళనాడులో ఓ దళిత ఎమ్మెల్యే ఓ బ్రాహ్మణ యువతిని పెళ్లాడాడు. ఈ విషయం నచ్చని ఆమె తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఈ సంఘటన అక్కడ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తమిళనాడులోని కళ్లాకురిచి నియోజకవర్గానికి చెందిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఎ.ప్రభు స్థానికంగా ఉన్న సౌందర్య అనే ఓ బ్రాహ్మణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి తండ్రి అక్కడే ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.
కాగా తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఆమెను తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్నాడని సదరు అర్చకుడు చెబుతున్నాడు. అయితే ఆ ఎమ్మెల్యే ఇందుకు స్పందిస్తూ.. తాము 4 నెలలుగా ప్రేమించుకుంటున్నామని, ఈ క్రమంలోనే పెద్దల అంగీకారం మేరకు పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయితే తన కుమార్తె మైనర్గా ఉన్నప్పటి నుంచే అతను ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడని, ఆ ఎమ్మెల్యే తమ ఇద్దే ఉండేవాడని, అతన్ని సొంత కొడుకులా చూసుకున్నామని, కానీ అతను మోసం చేశాడని, తమకు కులం పట్టింపు లేదని, కానీ తమ కుమార్తెకు, అతనికి ఏజ్ గ్యాప్ చాలా ఉందని, తమ కుమార్తెకు 19 ఏళ్లు ఉంటే, అతనికి 36 ఏళ్లు అని.. ఈ విషయంలోనే తాము విభేదించామని.. ఆ యువతి తల్లిదండ్రులు తెలిపారు.
ఈ క్రమంలోనే ఆ అర్చకుడు సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. అయితే పోలీసులు సరైన సమయానికి చేరుకుని ఆ అర్చుకున్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్యే ప్రభు మాట్లాడుతూ.. సౌందర్య, తాను కేవలం 4 నెలల నుంచే ప్రేమించుకుంటున్నామని, ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించానని అనడం అబద్ధమని అన్నారు. సౌందర్య తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోని మాట నిజమేనని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయమై అక్కడ దుమారం చెలరేగుతోంది. అంత ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి తన కన్నా చాలా చిన్న వయస్సు ఉన్న యువతిని ఎలా పెళ్లి చేసుకుంటాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.