దసరా స్పెషల్ : దసర పండగ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటూ ఉంటారు.శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక దసరా అనే పేరు వచ్చింది.దసరా పండగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. అలాగే ఈ దేవీ నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కో ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మరి నవరాత్రులలో మొదటి రోజు అయిన బాలత్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా పెడతారు. మరి అది ఎలా తయారుచేయాలో పెట్టాలో తెలుసుకుందామా.
కావలసిన పదార్ధాలు :
పెసరపప్పు – 150 గ్రాములు
కొత్త బియ్యం -100 గ్రాములు
మిరియాలు – 15
పచ్చిమిరప కాయలు -6
పచ్చి కొబ్బరి – 1 కప్పు
కాచిన నెయ్యి -1/4 కప్పు
జీడిపప్పు- 15
జీలకర్ర -1/2 టేబల్ స్పూన్
ఆవాలు- 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి -3
మినపప్పు -1 టేబుల్ స్పూన్
శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర-కొద్దిగా
కరేపాకు -కొద్దిగా
ఉప్పు-రుచికి తగ్గట్టు
ఇంగువ -చిటికెడు.
తయారు చేయు విధానం :
ఒక దళసరి పాత్రను తీసుకుని కొద్దిగా వేడి చేసి అందులో కాస్త నేయి వేసి వేడి చేయాలి. అ తర్వాత అందులో పెసరపప్పుని వేసి దోరగా వేయించాలి.పెసరపప్పు వేగాక కడిగిన బియ్యం కూడా వేసి ఒక 5 నిమిషాలు వేపితే చాలు. ఇక్కడ ఒక విషయం మాత్రం అసలు మర్చిపోకండి. బియ్యం, పెసరపప్పు రెండు కూడా కలర్ మార కూడదు.
బియ్యం, పెసరపప్పు వేగిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోండి. తరువాత కుక్కర్ పోయి మీద పెట్టి అందులో.సన్నగా తరిగిన పచ్చి మిర్చి,పచ్చికొబ్బరి తురుము, జీలకర్ర,మిరియాలు,వేయించిన బియ్యం,పెసరపప్పు అన్ని వేసి 4 కప్పుల నీళ్లను పోయాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 కూతలు రానిచ్చి ష్టవ్ అఫ్ చేయండి.
కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి కొద్దిగా ఆవాలు, మినపప్పు ,శనగపప్పు ,జిలకర్ర ,ఎండుమిర్చి ,ఇంగువ,కరివేపాకు వేసి తాలింపు పెట్టి పొంగలిలో వేయాలి. ఇలా తయారుచేసిన వేడి వేడి పొంగలిలో ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి శ్రీ బాల త్రిపురసుందరీదేవికి నైవేద్యంగా పెట్టాలి.