దసర పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటూ ఉంటారు.దసరా పండగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. అలాగే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ప్రీతి పాత్రమైన ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మరి నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడతారు. మరి అది ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు :
బియ్యం 150 గ్రాములు
చింతపండు 50 గ్రాములు
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
పచ్చిమిర్చి -6
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
పులిహార తయారుచేసే విధానం :
ముందుగా అన్నంను కాస్త పోలుకుగా వండుకుని కాసేపు చల్లార నివ్వండి. తర్వాత అన్నంలో.పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి. మరొక పాత్ర తీసుకుని చింతపండును వేసి అందులో అరకప్పు నీళ్ళు పోసి చింతపండును ఒక పదినిముషాలు నానపెట్టాలి. తరువాత చింతపండులో ఉన్న తొక్కలు తీసేసి చిక్కటి గొజ్జును తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించుకోవాలి.అలాగే ఈ చింతపండు గుజ్జులోనే పచ్చి మిర్చినీ కూడా గాట్లు పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈగుజ్జును ముందుగా అరబెట్టుకుని ఉంచుకున్న అన్నంలో కలపాలి.తరువాత బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి వేసి పోపు వేగిన తరువాత వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేపాలి. తరువాత కరివేపాకు వేసి అన్నంలో కలిపితే కమ్మనైన, రుచికరమైన పులిహోర రెడీ అయినట్లే. ఈ పులిహారను ఆ గాయిత్రి దేవికి నైవేద్యంగా పెట్టి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోండి.