YS Viveka Murder Case: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ తాజాగా అరెస్టు చేసిన వైసిపి ప్రధాన కార్యదర్శి,కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుడిభుజమైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తాజాగా మీడియాకు విడుదల చేసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
వివేకానందరెడ్డి హత్య కేసుతో తన తండ్రికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన చెప్పుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. తండ్రిని రక్షించుకునే తాపత్రయం అయనది.అయితే అదే లేఖలో చైతన్యరెడ్డి ఆశ్చర్యకరంగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత పై ఆరోపణలు చేయటంతో పాటు,ఆమెకు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సంబంధాలు కలపడమే ఆసక్తికరంగా మారింది.నిజానికి సునీత ఒంటరి పోరాటం చేసి తన తండ్రి మరణంపై సీబీఐ దర్యాప్తు సాధించుకుంది.అదిప్పుడు వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో ఒక కొలిక్కి రాగా అసలు సునీతనే చైతన్యరెడ్డి తప్పుపట్టడం,ఈ వివాదంలోకి ఆంధ్రజ్యోతి ఎండీని లాగడం యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపించడం లేదు.వైసీపీ పెద్దల ఆదేశం మేరకే ఆయన ఈ తరహా లేఖను మీడియాకు రాసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
YS Viveka Murder Case” చైతన్య రెడ్డి చెప్పిందేమిటంటే?
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అసలు తన తండ్రి ఆ ప్రాంతంలోనే లేరని,జమ్మలమడుగులో ఉన్నారని చైతన్యరెడ్డి చెప్పుకొచ్చారు. తన తండ్రిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ప్రస్తుతం ఆయన ఒక శస్త్ర చికిత్స చేయించుకున్నారని, ఆయనకు వైద్యసాయం అవసరమని,ఆయనకు న్యాయం జరిగేటట్లు మీడియా చూడాలని చైతన్యరెడ్డి కోరారు.ఇదంతా ఒక ఎత్తయితే ఆ లేఖ తరువాయి భాగం లో సునీతపై చైతన్య రెడ్డి ఫోకస్ పెట్టారు.
YS Viveka Murder Case” సునీత చర్యలు దురుద్దేశపూరిత౦!
కాగా తన తండ్రి మరణించిన రోజు నుండి సునీత దురుద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తూ మీడియాకు తప్పుడు సమాచారం అందిస్తూ వచ్చారన్నారు.అంతేగాక దర్యాప్తు సంస్థలను కూడా ఆమె ప్రతిరోజూ కలుస్తూ ఏవో ఒక పిటిషన్లు అందించేవారన్నారు. ఆమె చర్యలను పరిశీలిస్తే ఈ దర్యాప్తును తప్పుదోవ పట్టించడమే సునీత ధ్యేయమని
స్పష్టమవుతోందన్నారు.అమాయకులను ఈ కేసులో ఇరికించడానికి ఆమె
ప్రయత్నించారన్నారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తో సునీతకు మైత్రి?
వైసిపి పై విష ప్రచారం సాగిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో సునీతకు సన్నిహిత సంబంధాలున్నాయన్నది చైతన్య రెడ్డి చేసిన మరో ప్రధాన ఆరోపణ.ఇటీవల రాధాకృష్ణ భార్య కనకదుర్గ మరణించగా సునీత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చిందని చైతన్య రెడ్డి తెలిపారు.ఆంధ్రజ్యోతి ద్వారా సునీత ఈ కేసులో వైసిపి అగ్రనేతల మీద కూడా బురద జల్లించే ప్రయత్నం చేసిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.చైతన్యరెడ్డి లేఖ ఇప్పుడు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది.