Brahmamgari Matam: కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి నియామక వ్యవహార పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం చెందగా, తదుపరి మఠాధిపతిగా పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని నియమించాలని మఠాధిపతులు నిర్ణయించారు. ఇది మఠం అనుసరిస్తున్న సాంప్రదాయమని వారు పేర్కొన్నారు. అయితే దివంగత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ తన కుమారుడిని పీఠాధిపతి చేయాలని, ఆ మేరకు తన భర్త వీలునామా కూడా రాశారని వాదించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వివాదం పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి నేతృత్వంలో కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో శుక్రవారం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.12వ మఠాధిపతిగా మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామికి అవకాశం దక్కింది. ఉత్తరాధికారిగా మొదిటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మారుతీ మాహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానున్నది. శనివారం ఈ ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు.
శివైక్యం చెందిన 11వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చందావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 ఏళ్ల వయస్సులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతీ మహాలక్ష్మమ్మను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా వీరు ఇద్దరు మైనర్లు.