సంచయిత గజపతిరాజు… ఇప్పుడు మీడియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు! మాన్సాస్ ట్రస్టు పై జరిగిన ఆధిపత్య పోరాటంలో అంతిమ విజేతగా నిలిచి వార్తల్లో వ్యక్తిగా సంచయిత మారారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అధికారం రాగానే ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. వంశపారంపర్య విధానంలో భాగంగా సింహాచలం ఆలయం చైర్మన్ కాగానే ఆమె తన విశ్వరూపాన్ని బయటపెట్టారు.పూసపాటి వంశంలో మూడవ తరం ప్రతినిధిగా రంగ ప్రవేశం చేసిన సంచయిత గజపతిరాజు వరసగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దాంతో ఆమె వైరి వర్గాలకు అడ్డంగా దొరికిపోతున్నారు.అనుభవలేమితో దూకుడు వైఖరితో ఆమె రోజుకో దుమారం రేపుతున్నారు. సంచయిత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చిక్కుల్లో పడుతోంది.సింహాసనం ట్రస్ట్ బోర్డు చైర్మన్ హోదాలో ఆమె 175మంది ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేశారు.
దీని మీద విపక్షాలు అల్లరల్లరి చేశాయి. వైసీపీ సర్కార్ ఇరుకున పడింది. దాంతో మంత్రి అవంతి శ్రీనివాస్ కలుగచేసుకుని మళ్ళీ కొత్త ఉత్తర్వు ఇప్పించి వారు బతుకు నిలబెట్టారు. అలా చైర్ పర్సన్ అయిన నెలలోనే ఆమె బ్రష్టు పట్టారు. తదుపరి ఇంకో ఉదంతం వెలుగు చూసింది. సింహాచలం ఆలయ పాలనా వ్యవహారాల ఓఎస్డీగా తనకు కావలసిన ఒక వ్యక్తిని ఆమె చెన్నై నుండి తీసుకువచ్చి ఆలయంలో తిష్ట వేయించారు. ఆయనకి నెలకు యాభై వేల రూపాయల జీతం కూడా ఫిక్స్ చేశారు.సింహాచలం వ్యవహారాలను ఆయన కంట్రోల్ లో పెట్టారు. ప్రతీ ఫైల్ ఆయనే చూడాలని కండిషన్ పెట్టారట. దీంతో ఆయన మూడు నెలలుగా సింహాచలం ఆలయ అతిథిగృహంలో బసచేసి ఆలయ అధికారుల పై స్వారీ మొదలుపెట్టారట. నిజానికి ప్రతిష్టాత్మకమైన సింహగిరి ఆలయానికి సీనియర్ మోస్ట్ దేవాదాయ అధికారి ఈవోగా ఉన్నారు .
ఆయన చూడాల్సిన ఫైళ్ళు అన్నీ ఈ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టి ఈవోను సంచయిత ఉత్సవ విగ్రహం చేశారన్న మాట వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలతో షాక్ తిన్న ఈవోను తనకు ఈ పోస్ట్ వద్దు బదిలీ చేయమంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారుట. ఇక సంచయిత తాను అన్నీ అనుకున్నట్లుగానే జరగాలని హుకుం జారీ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలు గతంలో చూడలేదని ఆలయ సిబ్బంది అంటున్నారు. దేవుడికి ఒక రూపాయి ఆదాయం వచ్చేలా చూడాలి కానీ ఇలా తెల్ల ఏనుగులను మేపడం అవసరమా అని ఆలయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
అలాగే ఆలయ ప్రతిష్టను నిలబెట్టేలా సంచయిత పనిచేస్తే ఆమెకు ఉజ్వల భవిషత్తు ఉంటుందని అంటున్నారు. పూసపాటి వంశీకురాలయిన సంచయిత తన బాబాయి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ఎదిరించి మరీ ఈ పోస్టులో వచ్చిన నేపథ్యంలో ఆమె మీద, అమె పని తీరు మీద వేయి కళ్ళునిఘా వేసి ఉన్నాయని, ముఖ్యంగా టిడిపి అదే పనిలో ఉందని సంచయిత తెలుసుకుంటే మంచిదని ఆమె తన వైఖరి మార్చుకోవాలని శ్రేయోభిలాషులే సలహా ఇస్తున్నారు.పెద్దల మాట పెరుగన్నం మూట డియర్ సంచయితా మేడమ్ !
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?