కరోనా లాక్ డౌన్ సమయంలో భారీగా తగ్గిపోయిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. దేశంలో ఈ డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రూ.1,15,174 కోట్లు జీఎస్టీ రూపంలోవసూలైనట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ వసూళ్లలో లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది మూడో సారి కావడం విశేషం. అయితే ఈ స్థాయిలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారని ఆర్థిక శాఖ శుక్రవారం వెల్లడించింది.
జీఎస్టీ మొదలు అయిన తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ లో అత్యధికంగా రూ.1,13,866 కోట్లు వసూలు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ లో 12 శాతం అధిక వసూళ్లతో ఆ రికార్డును తిరగరాసింది. 12 శాతం వృద్ధి రేటు నమోదు కావడం గత 21 నెలల్లో ఇదే తొలి సారి అని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడంతో పాటు పన్ను ఎగవేతదారులపై దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించి సంస్థాగతంగా మార్పులు చేయడమేనని అభిప్రాయపడింది.
సీజీఎస్టీ రూ.21,365 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.27,804 కోట్లు, ఐజీఎస్టీ రూ.57,426 కోట్లు, సెస్ రూపంలో రూ.8,579 కోట్లు వసూళ్లు అయినట్లు కేంద్రం వివరించింది. ఏపి నుండి డిసెంబర్ లో రూ.2,581 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. 2019 డిసెంబర్ తో పోలిస్తే ఈ డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరిగినట్లు గుర్తించారు. ఇక తెలంగాణ నుండి రూ.3,543 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2019 డిసెంబర్ తో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 4 శాతం పెరిగాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?