Rahul Gandhi: స్వాతంత్రోద్యమ కాలంలో దేశ వ్యాప్తంగా చాలా మంది తమ స్థిర చరాస్తులను జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారు. ఆ తరువాత కాలంలో వారసులు లేని చాలా మంది తమ ఆస్తులను దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు దానంగా ఇవ్వడం చూశాం. కానీ ప్రస్తుత రోజుల్లో ఓ 78 ఏళ్ల వృద్ధురాలు తన యావదాస్తిని ఓ జాతీయ పార్టీ నేత పేరుతో వీలు రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కి చెందిన వృద్దురాలు తన చరాస్తినంతా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పేరిట రాసి ఇచ్చింది. డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన పుష్ప ముంజియాల్ అనే వృద్ధురాలు ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. ఆమెకు వారసులు ఎవరు లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అభిమానంతో తనకు ఉన్న రూ.అరకోటికిపైగా ఆస్తికి రాహుల్ రాహుల్ ను నామినీగా పేర్కొంటూ వీలునామా రాయించి స్థానిక కోర్టులో సమర్పించింది. వీటికి సంబంధించిన పత్రాలను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కు సోమవారం అందజేస్తూ, తను ఈ పని ఎందుకు చేశారో వివరించారు.
Rahul Gandhi: రాహుల్ ఆలోచనలు ప్రభావితం చేశాయి
నిరాడంబరత, నిజాయితీ, నిష్కలంకతత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్న ఆమె రాజకీయ ప్రత్యర్ధులు ఆయనను అనవసరంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనను వేధించడం తనకు భాద కల్గించిందనీ, ఆందుకే ఆయనకు మద్దతు గా నిలవాలనుకున్నానని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచనలు దేశానికి అవసరమని, ఆయన ఆలోచనలు తనను ప్రభావితం చేశాయనీ, అందుకే తన ఆస్తిని ఆయనకు ఇస్తున్నానని చెప్పారు. తొలుత తన ఆస్తిని రాహుల్ గాంధీ భార్యకు ఇవ్వాలని భావించాననీ, కానీ ఆయనకింకా వివాహం కాకపోవడంతో రాహుల్ పేరిటే వీలునామా రాసినట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో ఉన్న 50 లక్షల ఫిక్డ్స్ డిపాజిట్ లకు రాహుల్ గాంధీ పేరును నామినీగా రాసిన ఆమె తన వద్ద ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను మరణానంతరం రాహుల్ గాంధీకి చెందేలా వీలు రాశారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును గెలవలేకపోయింది. ప్రజాకర్షక పథకాలను పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఆ రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధురాలి మనసును రాహుల్ గాంధీ గెలుచుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అభిమానులు స్పందిస్తున్నారు. రాహుల్ అభిమానులు ఆ వృద్ధురాలి చర్యను మెచ్చుకుంటున్నారు.