Delhi CM: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రిటీలు కరోనా బారినపడుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తాను హౌస్ ఐసోలేషన్ లో ఉన్నానని సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. “నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేషన్ లో ఉండండి, మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కాగా ఢిల్లీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో సోమవారం 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది.