ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు రావడం, పలు అంశాలు మీడియాకు లీక్ అవుతుండటం పట్ల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో ఇప్పటి వరకూ ఎలాంటి పత్రికా ప్రకటనలు తాము విడుదల చేయలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సీబీఐ మాత్రం మూడు ప్రకటనలు విడుదల చేసినట్లు వెల్లడించింది. సీబీఐ ప్రకటనలకు మీడియా కథనాలకు సంబంధం లేదని, సీబీఐ, ఈడీ ప్రశ్నించని వారిని కూడా ప్రశ్నించినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లుగా పిటిషన్ పేర్కొన్న నేపథ్యంలో .. అయిదు టీవీ ఛానళ్లకు కోర్టు నోటీసులు పంపింది.
రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఏఎన్ఐ, జీ న్యూస్ మీడిాయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ అయిదు ఛానళ్ల వార్త నివేదికలను పరిశీలించాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఎస్ఏ)ని న్యాయస్థానం ఆదేశించింది. ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటనల ఆధారంగానే వార్తలు ప్రసారం చేయాలని, ప్రసార మార్గదర్శకాలకు మీడియాలు కట్టుబడి ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.