(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు పార్టీ గుర్తింపు రద్దుపైనా కోర్టు వ్యాజ్ఞం నడుస్తున్నది. ఇప్పటికే వైసిపి ప్రభుత్వం వివిధ అంశాలపై ఎపి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు, వాయిదాలు నడుస్తుండగా తాజాగా పార్టీ గుర్తింపు రద్దు విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరో తలనొప్పికి కారణమైంది. సిఎం జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నా, పలు కీలక నిర్ణయాలపై ప్రత్యక్షులు న్యాయ స్థానాలను ఆశ్రయించడంతో తలనెప్పులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 60 కిపై పిటిషన్ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఢిల్లీ హైకోర్టు నుండి నోటీసులు అందాయి.
ఏపిలో వైసిపి గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్పై గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ఉపయోగిస్తున్నలెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జగన్ నేతృత్వంలోని పార్టీని రద్దు చేసి వైసిపి పేరు వాడకుండా చూడాలని పిటిషనర్ కోరారు. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్లు వేయాలని వైసిపి, సిఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ నాల్గవ తేదీకి వాయిదా వేసింది.