Delhi High Court: మైక్ దొరికితే చాలు ఎడాపెడా హామీలు ఇచ్చేసే ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలిచ్చి వాటిని గాలికి వదిలేయడం ఇక కుదిరే పని కాదు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కోర్టు ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.నిజానికి ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సంబంధించిన కేసులో వెలువడిన తీర్పు కావచ్చు.కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పు ప్రభావం కనిపించే అవకాశం లేకపోలేదు.
కేజ్రీవాల్ కేసేమిటంటే?
కరోనా కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల అద్దె బకాయిలను తాము చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో మొదటి లాక్డౌన్ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కిరాయి చెల్లించలేనివారు చెల్లించనక్కర్లేదని, ఇంటి యజమానులు కూడా కిరాయి కోసం బలవంతం చేయవద్దని ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన మార్చి ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఒక స్పష్టమైన పత్రికా ప్రకటన చేశారు అయితే ముఖ్యమంత్రి ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు దీనిపై సీఎం ఆధీనంలోనే ఉండే రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకపోవడాన్ని కిరాయిదారులు, ఇంటి యజమానులు ఒక పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ సంచలన తీర్పు ఇచ్చారు.
తీర్పు సారాంశం ఏమిటంటే!
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆ హామీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం ఇచ్చిన హామీ, వాగ్దానం లేదా చేసిన ప్రకటన స్పష్టంగా అమలుచేయదగ్గ వాగ్దానం అవుతుందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఒకసారి హామీ ఇచ్చాక దానిని అమలు చేయాలా వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్ట వ్యతిరేకం అవుతుందని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాధినేతలు తమ పౌరులకు బాధ్యతాయుతమైన హామీలు ఇవ్వాలని,అవి అమలయ్యేలా చూడాలని న్యాయమూర్తి చెప్పారు.ముఖ్యమంత్రి ఆర్థికపరమైన పర్యవసనాలు అన్నీ తెలిసే హామీలు ఇస్తారని,ఇప్పుడు ఏవేవో సాకులు చూపి ఆ హామీ అమలు నుండి తప్పుకోవటం కుదరదన్నారు.కిరాయిదారుల అద్దెల చెల్లింపు విషయంలో ఆరువారాల్లోగా ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ప్రతిభా సింగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
పౌరుల చేతికో ఆయుధం!
ఈ కేసు తీర్పులోనే జస్టిస్ ప్రతిభా సింగ్ పౌరులకు కూడా ఒక పదునైన ఆయుధాన్ని అందించారు.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ సందర్భంలోనైనా సరే ఇచ్చే హామీల అమలుకు ప్రజలు పట్టుబట్టవచ్చని,కోర్టు తలుపులు తట్టవచ్చని ఆయన తెలిపారు.ఇలాంటి హామీలపై విధాన నిర్ణయం ప్రకటించకుండా నాన్చడం కుదరదని, ప్రజలు కోర్టులకు వెళ్లవచ్చునని న్యాయమూర్తి వివరించారు.