కరోనా బారిన పడి కోలుకున్న వారి నుంచి సేకరించే ప్లాస్మాతో అత్యవసర స్థితిలో ఉన్న కోవిడ్ పేషెంట్లను రక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంత లాభం ఉంటుందని తెలిసినా అనేక మంది కోవిడ్ రికవరీ అయిన వారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎప్పటికప్పుడు అవసరం ఉన్నవారికి తన ప్లాస్మాను దానం చేస్తూనే ఉన్నాడు. అలా ఇప్పటి వరకు అతను ఏకంగా 7 సార్లు తన ప్లాస్మాను దానం చేశాడు.
ఢిల్లీలోని జహంగిర్పురికి చెందిన 36 ఏళ్ల తబ్రేజ్ ఖాన్ మార్చి నెలలో విదేశాల నుంచి వచ్చిన తన సోదరిని కాంటాక్ట్ అవడం వల్ల కరోనా బారిన పడ్డాడు. ఏప్రిల్ 5న అతను కరోనా నుంచి కోలుకున్నాడు. ఏప్రిల్ 20న అతను మొదటి సారిగా ప్లాస్మాను దానం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా అతను తన ప్లాస్మాను అవసరం ఉన్నవారికి దానం చేస్తూనే ఉన్నాడు. తాజాగా అతను 7వ సారి ప్లాస్మా దానం చేశాడు.
ఈ సందర్భంగా తబ్రేజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఇతరులను రక్షించమని తనకు దేవుడు పంపిన సందేశంగా భావిస్తూ.. ప్లాస్మాను దానం చేస్తున్నానని.. అలా చేస్తూనే ఉంటానని తెలిపాడు. అందులో తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందన్నాడు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కరోనా వల్ల అత్యవసర స్థితిలో ఉండగా.. తన ప్లాస్మా ఇచ్చానని.. అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడడమే కాక కరోనా నుంచి కోలుకున్నాడని తెలిపాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు వచ్చి తనను పట్టుకుని ఆనంద భాష్పాలు రాల్చారని, ఆ సంఘటన తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగించిందని.. తబ్రేజ్ ఖాన్ చెప్పాడు.