న్యూఢిల్లీ: తండ్రిని చెంపదెబ్బ కొట్టాడని అతని ఇద్దరు కొడుకులూ కలిసి ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ చెంపదెబ్బ కొట్టింది ఎందుకయ్యా అంటే ఇంటి ఎదురుగా మూత్రవిసర్జన చేశాడని.
దక్షిణ ఢిల్లీ, గోవిందపురి ప్రాంతంలో ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో లిలు అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంటి బయట కూర్చున్నాడు. ఇంతలో సమీపంలో నివసించే ఒక 65 ఏళ్ల వ్యక్తి అటుగా వచ్చి లిలు ఇంటి ఎదురుగా వీధిలో మూత్రం పోశాడు. దానితో లిలు అతనితో ఘర్షణ పడ్డాడు. చివరికి ఓ చెంపదెబ్బ తగిలించాడు.
కాస్సేపటికి చెంపదెబ్బ తిన్నవ్యక్తి కుమారులు ఇద్దరు వచ్చి లిలుతో గొడవ పడ్డారు. వారిలో ఒకరు వీధిలో ఉన్న రాయి తీసుకుని లిలు తలపై బలంగా మోదడంతో లిలు మృతి చెందాడు. లిలు రౌడీయిజం చేస్తుంటాడనీ, అతనిపై చాలా కేసులు ఉన్నాయనీ పోలీసులు తెలిపారు. లిలు హత్యకు సంబంధించి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.