వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్ కు సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం .. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నదని వెల్లడించింది. రానున్న ఆరు గంటల్లో క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు తెలిపింది. సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దులోని బాలాసోర్, సాగర్ దీవుల సమీపంలో తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది.
దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నట్లు చెప్పింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఏపిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.