ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా బైకులు, కార్లే. ఒక్కరికి రెండు మూడు వాహనాలు ఉంటున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా వాహనాలే ఎక్కువ. బయటికెళ్లి రెండు అడుగులు వేసి పాలు తీసుకురావాలన్నా బద్ధకం మనకు. దాని కోసం కూడా బైక్ నే వాడతాం. మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తేవాలన్నా బైకో కారో కావాల్సిందే. ఇలా పెట్రోల్, డీజిల్ ను వృథాగా ఖర్చు చేసి మనం చేస్తున్నదేంటి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం.
అందుకే.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ ఉండదు. అందుకే చాలామంది వాటి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులు, కార్లను తయారు చేశాయి. మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ధరలు కూడా సరసంగానే ఉండేవి. కానీ.. దేశీయ ఎలక్ట్రానిక్ బ్రాండ్ డిటెల్ మాత్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన ఎలక్ట్రిక్ బైక్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దాని పేరే డిటెల్ ఈజీ.
దాని ధర ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఈ బైక్ ధర కేవలం 19,999 రూపాయలు మాత్రమే. ఈ బైక్ కు 48 వాట్ల సామర్థ్యం గల 12 ఏహెచ్ ఎల్ఐ ఎఫ్ఈ పీవో4 బ్యాటరీని అమర్చారు.
ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా చార్జ్ అవ్వాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ అయ్యాక కనీసం 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాకపోతే ఈ బైక్ మామూలు బైకులంత స్పీడు వెళ్లదు. మాగ్జిమమ్ 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
మీకు ఇంకో విషయం తెలుసా? ఈ బైక్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం… ప్రజలు వాటిని విరివిగా ఉపయోగించాలన్న సదుద్దేశంతో ఈ బైక్ ను తీసుకొచ్చారు.