(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా పెద్ద ఎత్తున కర్రల సమరం నిర్వహిస్తుండటం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో వేలాది మంది యువకులు ఉత్సహంగా పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో కర్రల సమరం చూసేందుకు పరిసర గ్రామాల నుండి తరలి వస్తుంటారు.
అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది దేవరగట్టులో కర్రల సమరం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వం కర్రల సమరం రద్దు చేసినా ఆనవాయితీ ప్రకారం కర్రల యుద్ధం నిర్వహిస్తామని యువకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేవరగట్టు గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో 1500 మంది పోలీస్ బలగాలను దింపారు. గ్రామంలో 144సెక్షన్ విధించారు. దేవరగట్టు గ్రామానికి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు దేవరగట్టులో పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నేటి రాత్రి మాల మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగనున్నది. మరో పక్క ఆలయ పరిసర ప్రాంతంలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్, ఫాల్కన్ వాహనాలతో పోలీసులు నిఘా నిర్వహిస్తున్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాలలో మద్యం అమ్మకాలను అధికారులు నిషేదించారు.