వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ టిడిపి హయాంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని స్పష్టంగా గోచరిస్తుంది.
ఇప్పుడు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు తరచూ జగన్ ప్రభుత్వం పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు.దీంతో ఉమాకు చెక్ పెట్టాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి అందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం .ఇందులో భాగంగా కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్మించిన ఘాట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇందులో అవినీతి జరిగినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉండడంతో దాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు మీదకు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
2016లో కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పుష్కర్ ఘాట్ లను కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 34 పుష్కర ఘాట్లను నిర్మించింది. 24 పుష్కర్ నగర్ లను ఏర్పాటు చేసింది. వీటిలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, టెండర్లు లేకుండానే పనులు అప్పగించడంతో పెద్ద యెత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.రిటైర్ట్ ఎస్ఈ సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ఎస్ఈలు, ఒక ఈఈపై విచారణకు ప్రభుత్వం ఉత్తరువులు ఇచ్చింది .
అయితే అధికారులపై విజిలెన్స్ విచారణ కేవలం నామమాత్రమేనని, అసలు టార్గెట్ దేవినేని ఉమ మాత్రమేనని తెలుస్తోంది. తొలుత విజిలెన్స్ విచారణకు ఆదేశించినా తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందంటున్నారు. దేవినేని ఉమను ఈ కేసులో ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. 2016లో జరిగిన ఈ పనులపై విచారణ దేవినేని ఉమ కోసమేనన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.
జగన్ ప్రభుత్వం వరసగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకెళ్లారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల రిజిస్ట్రేషన్ల కుంభకోణ కేసులో ఇరుక్కున్నారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్య కేసులో అరెస్ట్ అవ్వడం తెలిసిందే.టిడిపి నేతలను బెంబేలెత్తించే విధంగా జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది .