తిరుపతి, ఫిబ్రవరి 5: పోలీసులకు కులాలను అంటగట్టి ఆరోపణలు చేయడం భావ్యం కాదని ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్. పి. ఠాకూర్ అన్నారు.
ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోమవారం ఢిల్లీలో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో పక్షపాతం లేకుండా ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే డిజితో సహా మరో ఇద్దరు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరారు.
జగన్ చేసిన ఆరోపణలపై డిజి ఠాకూర్ మంగళవారం స్పందించారు.
‘ నేను నిజాయితీగా పని చేస్తున్నా, అవినీతి నిరోధక శాఖలో డిజిగా నా పని తీరు ప్రజలకు తెలుసు’ అని డిజిపి ఠాకూర్ అన్నారు. జగన్ ఆరోపణలు మీడియాలో చూశానని ఆయన అన్నారు.
పోలీసు వాళ్లకు కులం ఉండదు, మాది ఖాకీ కులం అని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు మెరిట్ ప్రకారం పదోన్నతులు ఇచ్చారని డిజిపి అన్నారు. ఈ ఆరోపణలపై ఈసి అడిగితే సమాధానం ఇస్తానని ఠాకూర్ తెలిపారు.