భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు మహేంద్రసింగ్ ధోనీ. వికెట్ కీపర్ గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, హిట్టర్, కెప్టెన్.. ఇలా ధోనీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. 16 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో ఎన్నో సాధించి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. 1983 తర్వాత వరల్డ్ కప్ కోసం తపించిపోయిన భారతీయులకు 28 కలను తీరుస్తూ కెప్టెన్ గా 2011లో సగర్వంగా భారత్ కు వరల్డ్ కప్ అందించాడు. తొలి టీ20, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో ఇండియా నెంబర్ వన్.. ఇలా భారత క్రికెట్ కు కీర్తి కిరీటాలు అందించాడు.
ఇన్నేళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ కు కొనసాగించాడంటే గతంలో క్రికెట్ కోసం ఎన్నో త్యాగాలు చేసే ఉంటాడు. ఉన్నత చదువులు, కుటుంబం, సరదాలు, స్నేహితులు.. ఇలా ఎవరైనా ఒక కెరీర్ ను లక్ష్యంగా ఎంచుకుంటే చేయాల్సిన త్యాగాలే. అప్పటి సమయాన్ని తిరిగి పొందలేకపోయినా చేయాల్సిన పనుల్ని సమయం వచ్చినప్పుడు, రిటైర్ అయ్యాక తమ ఆలోచనలకు పదును పెడతారు. ఇప్పుడు ధోనీ కూడా ఇదే చేయబోతున్నాడని అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
పదో తరగతి, ఇంటర్మీడియట్ తర్వాత క్రికెట్ కారణంగా పెద్దగా చదవలేకపోయానని గతంలోనే చెప్పుకొచ్చాడు ధోనీ. 2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వొకేషనల్ స్టడీస్ లో చేరాడు ధోనీ. ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ లో చేరాడు కానీ క్రికెట్ కారణంగా ఆరు సెమిస్టర్లలో ఏ ఒక్కదానిలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈ కోర్సు ఇప్పుడు పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా.. ధోనీకి ఇష్టమైన ఆర్మీలో 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. రిటైర్మెంట్ తర్వాత ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ధోనీ అప్పట్లోనే తెలిపారు. బాల్యంలో తాను సైనికుడిగా మారాలనే కోరికను నేరవేర్చుకుంటానని ధోనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.