ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మెజార్టీ కోర్టు తీర్పులు ఉంటున్నాయి. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన జగన్ ప్రభుత్వం ఇందుకు విరుగుడుగా సరికొత్త మార్గాన్ని ఎంచుకొంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఏదైనా పిటిషన్ పడినప్పుడు, సర్కారు అందుకు దీటైన కౌంటర్ ఇస్తే కోర్టు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అసలు కౌంటరే సరిగ్గా లేకపోతే కోర్టులా పిటిషన్ ను అనుమతించే పరిస్థితి ఏర్పడుతోంది..ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వపరంగా కౌంటర్లు సరిగా లేనందు వల్లే కోర్టుల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని గమనించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కౌంటర్లు వేయడానికి మాత్రమే ఒక అధికారిని నియమించింది.
శ్యామలరావు అనే సీనియర్ అధికారికి ఆ బాధ్యతలు ఇచ్చేశారు. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగన్ ప్రభుత్వం ఆ విషయంలో తమ సర్కార్ కు ఎదురు దెబ్బ తగల కూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్డీఏ బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. వాటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.వాస్తవానికి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అయినా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా శ్యామలరావు ని నియమించింది.ఒక వేళ ఆయన సెలవు పెడితే.. ప్రత్యామ్నాయంగా మరో అధికారిని కూడా ముందే సిద్ధం చేశారు..మరో వైపు ఏపీ ప్రభుత్వం నియమించుకున్న న్యాయ సలహాదారులు.. న్యాయవాదుల పని తీరు.. ప్రభుత్వాన్ని నిరాశ పరుస్తోంది.
వారు పిటిషన్లు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. ఇక కోర్టులలో వాదనలు మాత్రం ఎంత సమర్థంగా వినిపించగలరని అసంతృప్తికి గురవుతున్నారు. గతంలో వరుస వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని.. హైకోర్టులో కొంత మంది న్యాయవాదుల్ని తొలగించి కొత్తవారిని నియమించారు. . మొత్తంమీద న్యాయవ్యవస్థ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఈ తరహా పరిణామాలు ఇదే మొదటిసారి అని న్యాయనిపుణులు చెబుతున్నారు