చిత్తూర్ జిల్లా రాజకీయాలు గమ్మత్త్తుగా ఉంటాయి. జిల్లాకు టీడీపీ తరఫున పెద్ద దిక్కుగా ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఎవర్ని భుజానకెత్తుకుంటారో, ఎవరిని కింద పడేస్తారో, ఎవరిని కేవలం అవకాశాలకు వాడుకునే రాజకీయాలు చేస్తారో , ఎవరికీ డబ్బు లేకున్నా రాజకీయ అవకాశాలు ఇస్తారో అర్ధం కానీ పరిస్థితి ఉంటుంది . నిన్న ఆనారోగ్యంతో మృతి చెందిన డీకే సత్యప్రభ విషయానికే వస్తే టీడీపీలో కొనసాగిన ఈ కుటుంబాన్ని చంద్రబాబు కేవలం ఎన్నిక ఖర్చులు, ఇతర పార్టీ వ్యవహారాల్లో ఆర్ధిక అవసరాలకే వాడుకున్నారు అనే మాట చిత్తూర్ రాజకీయాల్లో తరుచు వినిపిస్తుంది. అదెలాగో చదవండి
డీకే ఆదికేశవులనాయుడు భార్యగా ఆయన చనిపోయే వరకు కనీసం గడప కూడా దాటని సత్యప్రభ ఆదికేశువుల నాయుడు 2013 లో మృతి చెందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
అప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్న డీకే కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో చిత్తూర్ టీడీపీ టికెట్ను సత్యప్రభకు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో 2009 లో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయి, అనంతరం చంద్రబాబు టికెట్ హామీ మేరకు టీడీపీలోకి వచ్చిన ఆరని శ్రీనివాసులు (ప్రస్తుత చిత్తూర్ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ) పార్టీ కోసం మొత్తం ఖర్చు పెట్టి , పోటీకి సిద్ధం అవుతున్న తరుణంలో చివరి నిమిషంలో ఆరని శ్రీనివాసులును పక్కన పెట్టి మరి తనకు టికెట్ వద్దు అంటున్న డీకే సత్యప్రభకు పట్టుబట్టి మరి టికెట్ ఇచ్చారు. గడప కూడా దాటని ఆమె కేవలం చంద్రబాబు రమ్మన్నారు అనే కోణంలో రాగ ఆమెను ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చుపెట్టించారు. అప్పటి పొత్తు ఫలితాల వల్ల సత్యప్రభ గెలిచినా ఆమెకు సరైన న్యాయం చేయలేదు అనేది పార్టీ నాయకుల మాట. పార్టీ పదవి అప్పగించి , జిల్లాలో ఎలాంటి కార్యక్రమం జరిగిన డీకే కుటుంబంతో ఖర్చు చేయిస్తూ వాడుకున్నారు. కనీసం పొలిట్ బ్యూరోలోకి తీసుకోకుండా జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తగిలించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు, సంవత్సర విరాళాలకు మాత్రం భారీగా టీడీపీ పార్టీ దండుకుంది అనేది వారి డీకే అనుచరులు, వారి
కుటుంబ సభ్యులే చెప్పే మాట.
2019 లో మరో ప్లాన్
2019 ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సూచన మేరకు సత్యప్రభ చిత్తూర్ అసెంబ్లీ కి పోటీ చేయాలనీ అధినేతకు విషయం చెప్పారు . మొదట చంద్రబాబు సరే అన్నారు. తర్వాత చిత్తూర్ లో టీడీపీ తరఫున పోటీచేసేందుకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఇక డీకే సత్యప్రభ టీడీపీ అభ్యర్థి అవుతారని మీడియాలో చివరి వరకు ప్రచారం జరిగింది. అయితే అప్పటికి అప్పుడు సత్యప్రభను రాజంపేట ఎంపీ గా పోటీచేయాలని బాబు ఆదేశించారు. చిత్తూర్ టికెట్ కోసం అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన మనోహర్ ను పోటీ కి పెట్టారు . ఇదికూడా కేవలం ఎంపీగా ఎమ్మెల్యే లకు పెట్టాల్సిన ఖర్చు కోసమే ఆమెను అప్పటికి అప్పుడు స్థానం మార్చారు . ఎన్నికల్లో రాజంపేట కు బలమైన అభ్యర్థులు లేకపోవడం , రాజంపేట లోక్ సభ పరిధిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సత్యప్రభ ఐతే ఆర్ధికంగా తమకు సాయాపడతారు అని కోరడంతో బాబు ఏమి చేయలేని స్థితిలో ఆమెను రాజంపేట ఎంపీగా పోటీ చేయించారు అనేది కాదనలేని వాస్తవం. 2019 ఎన్నికల్లో లోక్ సభ పరిధిలో అనధికారికంగా అధికంగా ఖర్చు చేసిన అభ్యర్థి సత్యప్రభ.
అధికార పార్టీ వైపు వస్తారు అనే లోగ …
ఐతే 2019 ఎన్నికల తర్వాత డీకే కుటుంబంలో టీడీపీ తీరు పట్ల అసంతృప్తి వచ్చింది. ముఖ్యంగా ఇద్దరు అల్లుళ్ళు అధికార పార్టీ వైస్సార్సీపీ వైపు చూసారు. దానివల్ల అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది అని, రాజకీయంగా దన్ను ఉంటుంది అనే కోణంలో వైస్సార్సీపీ జిల్లా పెద్ద పెద్ది రెడ్డి తోను మంతనాలు సాగించారు. రెండు మూడు సార్లు వివిధ సందర్భాల్లో సైతం వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు 5 మంది వరకు సత్యప్రభ ఇంట్లో విందు సమావేశాలు జరిపారు. ఇక డీకే ఫామిలీ టీడీపీను వీడుతుంది అనే ప్రచారం విస్తృతంగా జరిగిన నేపథ్యంలో చంద్ర బాబు మల్లి డీకే సత్యప్రభ, ఆమె కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని చెప్పిన ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో డీకే కుటుంబం అధికపార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది.. ఈ సమయంలోనే సత్యప్రభ మృతి చెందటంతో వారి కుటుంబం భవిష్యత్తు లో రాజకీయ పడవ ఎక్కుతారా..? లేక వ్యాపారంలో ఉండిపోతారు అనే దానిపై చర్చ సాగుతోంది.