నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ముదిరి పాకాన పడింది.ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్ పైన, వైసిపి ప్రభుత్వం మీద ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శాసనసభ్యులు ఆయనపై ధ్వజమెత్తారు.
అదే సమయంలో పార్టీ కార్యకర్తలు కూడా స్పందించి ఎక్కడికక్కడ ఎంపి దిష్టిబొమ్మలు తగులబెట్టారు.దీంతో ఎంపీగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు .ఏకంగా తనకు ప్రాణహాని ఉందని కావున కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ లోక్సభ స్పీకరు కి లేఖ రాశారు.
తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.తనను వైసీపీ కార్యకర్తలు అసభ్యంగా దూషించి దిష్టిబొమ్మలు తగలబెట్టిన ఉదంతంపై నాలుగు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఎస్పీకి రాసిన లేఖలో ఎంపీ పేర్కొన్నారు.ఆచంట, ఆకివీడు ,ఉండి ,తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్లలో తాము ఫిర్యాదులు అందించినా ఎస్సైలు ఏవిధమైన చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.లోక్ సభ స్పీకర్ కు, ఎస్పీకి రాసిన లేఖల ప్రతులను ఎంపి రాష్ట్ర హోంమంత్రి సుచరితకి కూడా పంపారు.
కాగా ఎంపీ కావాలనే ఈ వ్యవహారాన్ని సాగదీస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.ఎలాగూ పార్టీలో సీన్ అయిపోయింది కాబట్టి వెళ్లిపోయే ముందు కొత్త రగడ సృష్టించాలన్నది రఘురామకృష్ణరాజు ఎత్తుగడ అంటున్నారు. ఇలాంటి ఫిర్యాదుల ద్వారా కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే జయంతో ఆయన ఉన్నారంటున్నారు.ఒకవేళ బెదిరింపు కాల్స్ నిజమైతే ఆ వివరాలను రాష్ట్ర పోలీసు శాఖకే అందించవచ్చునని కూడా వారు చెప్పారు.రఘురామ కృష్ణంరాజుసెల్ఫ్ స్క్రీన్ ప్లే తో ఇలాంటి నాటకాలాడుతున్నారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.