రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొందరు అక్రమార్కులు ఏకంగా సీఎంఒ కార్యాలయ ఉన్నతాధికారుల పేరుతో అక్రమ దందాలకు తెరలేపారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన రెండు సంఘటనలు వీటిని దృవపరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇవి తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. శిరోముండనం కేసులో భార్యతో సహా నిందితుడైన సినీ నిర్మాత నూతన నాయుడు ఏకంగా సీఎం పేషీలోని సీనియర్ ఐఎఎస్ అధికారి పివి రమేష్ పేరును ఉపయోగించి దందాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కళ్లాం రెడ్డి పేరుతో ఒ ముఠా అక్రమ దందాలు నెరిపిన వైనం బహిర్గతం కావడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జరిగిన దందాలపై నాడు సీఎంఒ పేషీలోని సీనియర్ ఐఎఎస్ అధికారి రమేష్, నేడు ముఖ్యమంత్రి సలహాదారు , రిటైర్డ్ ఐఎఎస్ అజయ్ కళ్లాం రెడ్డిలు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
అజయ్ కళ్లాం రెడ్డి పేరుతో నిరుద్యోగులకు టోకరా
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక ముఠా రంగంలోకి నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, తమకు సీఎం సలహాదారు అజయ్ కళ్లాం రెడ్డి బాగా తెలుసు అంటూ ప్రచారం చేసుకున్నారు. జూనియర్ లైన్ మెన్ పోస్టులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్స్ప్ సందేశాలు ఇచ్చి నిరుద్యోగ యువతను బుట్టలో వేసుకుంది ఈ ముఠా. నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. అజయ్ కళ్లాం రెడ్డి పేరు చెప్పడంతో ఎలాగైనా ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు భావించారు. తీరా డబ్బులు చెల్లించిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ విషయం చివరకు అజయ్ కళ్లాం కూడా తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. నేరుగా డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫోన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంగళగిరిలో కేసు నమోదు
డీజీపీ గౌతమ్ సవాంగ్.. అజయ్ కళ్లాం రెడ్డి నుండి అందిన ఫిర్యాదును గుంటూరు అర్బన్ పోలీసులకు పంపగా వారు విచారణ జరిపారు. మంగళగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పని చేస్తున్న మేకా వెంకటరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే ఈ వ్యవహారంలో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, నేటి ఆంధ్రా.కామ్ నిర్వహకుడు కీలకపాత్రులుగా పోలీసులు గుర్తించారుట. అయితే అధికార పార్టీ నేతలు చేసిన దందాను తప్పుదోవ పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వారికి ముడిపెట్టాలా చేస్తున్నారంటూ నేటి ఆంధ్రా.కామ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ దందా మొత్తం వైసీపీకి చెందిన వారే నిర్వహించారని ఆ సైట్ పేర్కొన్నది.