చంద్రబాబు చేతికి చిక్కుతారా..ఫిక్స్ చేస్తారా వైసీపీ ఆశావాహులకు కలిసొచ్చే అంశం
మాట తప్పను..మడమ తిప్పును అనేది జగన్ కు కవచం లాగా మారిన నినాదం. కానీ, ఇప్పుడు ఒక కీలక విషయంలో మాత్రం జగన్ వెనుకడుగు వేస్తున్నారా..మడమ తిప్పుతున్నారా అనేది ఇప్పుడు చర్చ.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి మూడు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి..మండలికి పంపిస్తే అక్కడ టీడీపీ సంఖ్యా బలం వాటిని అడ్డుకుంది. ఛైర్మన్ వాటిని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా ప్రకటించారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, తాము అధికారంలో ఉంటే మండలిలో తమ నిర్ణయం అమలు కాదా అనే..ఆగ్రహంతో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసారు. దానిని కేంద్రానికి నివేదించారు. అయితే, దీనిని టీడీపీతో సహా ఇతర పక్షాలు తప్పు బట్టాయి. కేంద్రం నుండి ఈ ప్రతిపాదన పైన ఇప్పటి వరకు స్పందన వ్యక్తం కాలేదు. ఇదే సమయంలో కొత్తగా వైసీపీ నుండి ఎమ్మెల్సీలు నామినేట్ అవుతున్నారు. అందునా ఎస్సీ..మైనార్టీ వర్గాల నుండి ఎంపిక చేసిన వారు. అంటే..జగన్ మండలి రద్దు ప్రతిపాదనను ఉపసంహరించు కుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఇదే జరిగితే చంద్రబాబుు చేతికి కొత్త అస్త్రంగా మారనుంది. ఇంతకీ జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయ..చంద్రబాబు కు చేతికి ఎలా చిక్కుతారు..
మండలి రద్దవుతుందా…విత్ డ్రా అవుతుందా..
రాష్ట్ర విభజన తరువాత ఏపీ శాసనమండలిలో సభ్యుల సంఖ్య 58గా ఉంది. అందులో టీడీపీకి అధిక సభ్యులున్నారు. ప్రస్తుతం టీడీపీకి 27 మంది ఉన్నారు. కాగా, వైసీపీ సభ్యులు 8 మంది కొనసాగుతున్నారు. అయితే, 2021 మార్చి నెలాఖరు నాటికి దాదాపు 15 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ సీట్లన్నీ రానున్న రోజుల్లో శాసనసభలో అధిక సంఖ్యా బలం ఉన్న వైసీపీకే దక్కనున్నాయి. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ కోటాలో స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, మండలిలో తాము ప్రతిపాదించిన బిల్లులు ఆమోదం పొందలేదనే ఆగ్రహంతో జగన్ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే, కేంద్రంలో దీని పైన ఎటువంటి ముందడుగు పడలేదు. ఇదే సమయంలో ఏపీలో వరుసగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ భర్తీ చేస్తోంది. అందునా తాజాగా డొక్కా..గవర్నర్ కోటాలో ఎస్సీ..మైనార్టీ నేతలకు అవకాశం ఇచ్చారు. అంటే..శాసనమండలి రద్దు విషయంలో జగన్ మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే మార్చిలో జరిగే 2021-22 బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తాను గత సమావేశాల్లో ప్రతిపాదించిన మండలి రద్దు తీర్మానం ఉప సంహరించుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఆలోచనతోనే జగన్ తాను హామీ ఇచ్చిన వారికి ఖాళీల ఆధారంగా మండలిలో సభ్యులుగా నియామకాలు ప్రారంభించారని చర్చ సాగుతోంది.
అప్పుడు చంద్రబాబు చేతికి చిక్కినట్లేనా…
వరుసగా మండలిలో తమ పార్టీ వారితో భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్..గతంలో తీసుకున్న నిర్ణయం మీదనే నిలబడితే..ఈ వర్గాలకు మండలి రద్దవుతుందని తెలిసి..వారికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి.. ఇప్పుడు వారిని మోసం చేసారంటూ టీడీపీ విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. 2021 నాటికి ఏపీ శాసన మండలిలలో వైసీపీకి దాదాపు 30 సభ్యులకు పైగా బలం ఉంటుంది. టీడీపీ బలం కేవలం 12 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన స్థానాలు..అక్కడ ఎన్నికలు జరిగిన తరువాత ఎవరి ఖాతాలో వచ్చేదీ స్పష్టత రానుంది. ఇక, ఎమ్మెల్యే కోటాలో జరిగే భర్తీ పూర్తిగా వైసీపీ సభ్యులకే అవకాశంగా మారనుంది. ఇక, జగన్ సైతం అనేక మందికి గత ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఉన్నారు. అయితే, ఒక సారి నిర్ణయం తీసుకుంటే దాని నుండి మళ్లీ వెనకడుగు వేయటానికి జగన్ ఇష్టపడరు. కానీ, ఇప్పుడు మండలిలో పూర్తిగా తమ పార్టీ సభ్యులకు అవకాశం కల్పించే పరిస్థితులు ఉండటం..సభలో వైసీపీ అధిపత్యం వస్తుండటంతో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ఖచ్చితంగా మార్చు కుంటారని చెబుతున్నారు. అయితే, అప్పుడు టీడీపీ బలం తగ్గిపోవటంతో టీడీపీ అధినేత చంద్రబాబు మండలి రద్దు ఇప్పుడ తప్పు బట్టినా..ఆ సమయంలో ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో న్యాయ స్థానాల ద్వారానే జగన్ ప్రభుత్వం మీద ఎక్కువగా పోరాటం చేస్తున్న టీడీపీ ఇదే జరిగితే మరి..కామ్ గా ఉంటుందా అనేది ప్రశ్న. అసలు..జగన్ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా లేక ఉప సంహరించుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.