కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకూ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు మద్య నే పోటీ ఉంటుందని, ఈ రోజు వీరు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కూడా తమ మధ్య స్నేహపూర్వక ఫోటీగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న ఏఐసీసీ కార్యాలయం నుండి నామినేషన్ పత్రాలు తీసుకున్న దిగ్విజయ్ సింగ్ ఆ తరువాత శశిథరూర్ నివాసానికి వెళ్లి కలిశారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత ఇది సహోద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ అని, ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లేనని శశిథరూర్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయానికే సీన్ మారిపోయింది. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుండి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ లు ఈ రోజు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
తొలుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన సీఎం పదవిని సచిన్ పైలట్ కు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే జోడు పదవులకు పార్టీ ఒప్పుకోకపోవడంతో తన వర్గీయుడికే సీఎం పదవి కట్టబెట్టాలని యోచన చేశారు. ఆ నేపథ్యంలో గెహ్లాట్ వర్గానికి చెందిన 90మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు స్పీకర్ కు సమర్పించారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ నిన్న సోనియా గాంధీని కలిసి రాజస్థాన్ లో జరిగిన పరిణామాలపై క్షమాపణలు చెప్పడంతో పాటు అధ్యక్ష బరి నుండి తప్పుకుంటానని, సీఎంగానే కొనసాగుతానని చెప్పారు. అంతకు ముందే దిగ్విజయ్ సింగ్ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే బరిలో దిగుతున్నట్లు ప్రకటించడంతో దిగ్విజయ్ సింగ్ డ్రాప్ అయ్యారు.
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ..మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని, నిన్న ఆయన నివాసానికి వెళ్లానని, మీరు పోటీ చేస్తే తాను బరి నుండి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు, అయితే తాను పోటీ పడటం లేదని ఆయన అన్నారనీ, అయితే అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి బరి నుండి తప్పుకున్నాను అని తెలిపారు. తాను ఖర్గేకి మద్దతుగా నిలుస్తాననీ, ఆయనకు ప్రతిపాదకుడిగా ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ కే పని చేశాననీ, చివరి వరకూ కాంగ్రెస్ తోనే ఉంటానని పేర్కొన్నారు దిగ్విజయ్ సింగ్. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ – గాంధీ కుటుంబానికి విధియుడిగా ఉండటం ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని దిగ్విజయ్ సింగ్ అన్నారు.