వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లు తెరవాల్సిన తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకుని సులువుగా వచ్చే ఎన్నికల్లో కూడా గట్టెక్కేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రికి ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది.
వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల క్రితం సాగించిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావ సూచకంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరో తేదీ నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలకు పిలుపునివ్వటం తెలిసిందే.ఈ పాదయాత్రల్లో వైసిపి నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు కూడా తండోపతండాలుగా పాల్గొంటారని జగన్ సర్కార్ అంచనా వేసింది.అంతేకాకుండా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జనబలం పునాది కాగలదని కూడా లెక్కలేసుకుంది.కానీ వాస్తవంలో ఇందుకు భిన్నంగా జరిగింది.ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఎంత కష్టపడ్డా వైసిపి నాయకులు కార్యకర్తలే ఈ పాదయాత్రలపట్ల ఆసక్తి చూపలేదని పార్టీ కార్యాలయానికి సమాచారం అందుతోంది.
ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టడంతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల కింద నేరుగా లబ్ధిదారులకే నగదు జమ చేస్తున్నారు.దీంతో ఈ వ్యవహారాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తల పాత్రేమీ లేకుండా పోతోంది.ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంక్షేమ పథకాల అమలు బాధ్యతను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్గరుండి చూసుకునేవారు అంతో ఇంతో లబ్ధిపొందే వారు.జగన్ హయాంలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఇలాంటి అవకాశం లేకుండా పోవడంతో వారు నిరాశానిస్పృహలకు గురయ్యారట.అన్నీ అమరావతి నుండి సీఎం చేసేసుకుంటుంటే ఇక తమకు పార్టీలో ఏ పాత్ర ఉందని వారు అలిగారు.జనాల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వకుండా జగన్ తమను ఉత్సవ విగ్రహాలుగా చేశారని వారు లోలోపల రుసరుసలాడుతున్నారు.
పార్టీ అధికారంలో ఉన్న పది పైసలు సంపాదించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి దాపురించిందని వారు గుసగుసలాడుకుంటున్నారు .ఈ కారణం చేత వారు పాదయాత్ర దూరంగా ఉండి పోయి తమ నిరసన తెలిపారంటున్నారు.ఇక ప్రభుత్వం నుంచి డబ్బులు అందుకున్న లబ్ధిదారులు కూడా తమకు అందాల్సినది అందింంది కాబట్టి ఇక పాదయాత్రకు వచ్చేదేమీటని ఇంటిపట్టునే ఉండిపోయారు.వచ్చినా రాకున్నా జగన్ తమకు డబ్బులు పంపిస్తాడని వారు రిలాక్స్ అవుతున్నారు.దీంతో రాష్ట్రంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అన్న కార్యక్రమం పేలవంగా సాగిందని పార్టీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది.ఇది చూసిన తర్వాత అయినా మంత్రాలకు చింతకాయలు రాలవని సంక్షేమ పథకాలకు ఓట్లు పడవని వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా గ్రహించటం అవసరం అంటున్నారు.