హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్పై వెళ్తున్న కుర్మయ్యను ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవంబర్ 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద పశు వైద్యురాలు దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల్లో చెన్నకేశవులు ఒక్కడు. నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు డిసెంబరు 6న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన 17 రోజులు తర్వాత నిందితుల అంత్యక్రియలు డిసెంబర్ 23న నిర్వహించిన సంగతి తెలిసిందే.
దిశ హత్యకేసు నిందితుల్లో ఏ1 నిందితుడైన ఆరిఫ్ స్వగ్రామమే జక్లేర్. మిగిలిన నిందితులైన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు స్వగ్రామం గుడిగుండ్ల. ఇప్పుడు చెన్నకేశవుల తండ్రి కురుమయ్య జక్లేర్ గ్రామంలోనే రోడ్డుప్రమాదానికి గురికావడంతో ఆ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది.