(విజయవాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత స్థానంలో ఈ ఆలయం ఉంది. రీజనల్ జాయింట్ కమీషనర్ హోదా స్థాయి అధికారి ఆలయ కార్యనిర్వహణ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నా తరచు ఏదో ఒక వివాదం చెలరేగడం, దానిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, భక్తుల మనోభావాలు దెబ్బతినండ తరువాత దాని గురించి మరిచిపోవడం జరుగుతూనే ఉంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1998లో ఆలయంలో జరిగిన చోరీ తీవ్ర సంచలనం అయ్యింది. అప్పటి గుంటూరు పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు అమ్మవారికి సమర్పించిన బంగారు కిరీటంతో పాటు పలు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఆ చోరీని సీరియస్ గా తీసుకుని సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే చోరీని ఛేదించారు. ఘటనా స్థలంలో వేలి ముద్రల ఆధారంగా సాహు అనే పాత నేరస్తుడిని సీఐడీ అధికారులు పట్టుకుని చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది. దీంతో ఆ కథ ముగిసింది. తరువాత తరచూ అమ్మవారి చీరలు అపహరణ, హుండీ కానుకల లెక్కింపు సందర్భంలో హస్తలాఘవం, దర్శనం టికెట్ల రీసైక్లింగ్, భక్తుల సామాగ్రి అపహరణ వంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దాదాపు 50లక్షల వ్యయంతో నిరంతర పర్యవేక్షణకు 130 సీసీ కెమెరాలను ఆలయం లోపల, వెలుపల ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న నేరాల సంఖ్య దాదాపు తగ్గాయి. అయితే రెండేళ్ల క్రితం ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించడం కలకలాన్ని సృష్టించింది. ఆలయ అధికారే క్షుద్రపూజలు నిర్వహింపజేశారంటూ నాడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు పోలీసులు సీసీ టీవీ పుటేజీ స్వాధీనం చేసుకుని పరిశీలన చేయగా ఆలయానికి సంబంధం లేని పూజారి ఒకరు అర్థరాత్రి సమయంలో గర్భాలయం వద్ద పూజలు చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. ఇలా వివాదాలు, ఆరోపణలు తలెత్తిన సమయంలో అధికా్రులపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం రివాజుగా మారింది.
ఇటీవల ఆలయంలోని వెండి రథంకు ఉన్న మూడు వెండి సింహాలు అపహారణకు గురి కావడం, అది మీడియాలో వచ్చే వరకూ అధికారులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం తదితర పరిణామాలు తీవ్ర వివాదాన్ని, కలకలాన్ని రేపాయి. దీనికి తోడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రతిపక్షాలకు ఆస్త్రంగా మారింది. వెండి సింహాలు చోరీ చేసిన చోరాగ్రేసరుల కోసం ఇప్పుడు పోలీసుల వేట కొనసాగుతోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఈ కేసును త్వరగా ఛేధించాలన్న పట్టుదలతో పోలీస్ యంత్రాంగం ఉంది.