District collector: తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. విషయం ఏమిటంటే ఓ చిన్న పూరి గుడిసెలో 80 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తుండేది. తనని చూసుకోవడానికి ఎవరూ లేరు. చుట్టుపక్కల వారు కూడా ఎవరూ ఆదరించే వారు కాదు. ఆ వృద్ధురాలు పడుతున్న కష్టం, ఇబ్బందులు జిల్లా కలెక్టర్ కు ఏవిధంగా తెలిసిందోఏమో. ఒక రోజు తన ఇంటి నుండి క్యారియర్ లో భోజనం తీసుకుని ఆ అవ్వ ఉండే పూరి గుడిసెకు కలెక్టర్ వెళ్లాడు. ఆ అవ్వకు వచ్చింది ఎవరో తెలియదు. కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోవడంతో ఆమెతో కలిసి కింద నేలపైనే కలెక్టర్ కూర్చున్నాడు.
నీతో కలిసి భోజనం చేద్దామని క్యారియర్ తెచ్చానని చెప్పాడు. తన ఇంటిలో కంచాలు కూడా లేవని అరటి ఆకులో తినాలి అని చెప్పడంతో సరే అని ఆమెతో కలిసి అరటి ఆకులో భోజనం చేశాడు కలెక్టర్. భోజనం చేసి వెళుతూ ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చారు. ఆ అవ్వకు అవి ఏమిటో అర్థం కాలేదు. అందులో ఇందిరా ఆవాజ్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రంతో పాటు వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన పత్రాలు ఉన్నాయని చెప్పారు కలెక్టర్.
ఫించన్ కూడా బ్యాంకుకు వెళ్లనవసరం లేదనీ, ప్రతి నెలా ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తారనీ, ఇల్లు కట్టుకోమని చెప్పి వెళ్లారు. దీంతో ఆ ఆవ్వ కళ్లనిండా ఆనంద భాష్పాలతో ఆ అధికారికి చేతులు ఎత్తి నమస్కరించింది. కలెక్టర్ నేరుగా ఓ పేదరాలి ఇంటికి వచ్చి ఆమెతో భోజనం చేసి పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణం పత్రాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇటువంటి కలెక్టర్ జిల్లాకు ఒకరు ఉంటే చాలు పేదల జీవితాల్లో వెలుగులు నిండినట్లేనని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.