TDP : టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దీంతో టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు ఇద్దరు నేతలు వచ్చారు. బెజవాడ పార్టీలో గ్రూప్ గొడవలపై నేతలను చంద్రబాబు పిలిపించారు. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, వెంకన్నతో పలుమార్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. బెజవాడ వర్గపోరుకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కి మాటల యుద్ధానికి దిగడాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. ఇకపై పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడిస్తే సహించేది లేదని హెచ్చరించింది.
TDP : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ!
వీఎంసీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తుండగా, అదే డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కుమార్తె పూజితను బుద్దా వెంకన్న, నాగుల్మీరాలు బలపరుస్తున్న సంగతి తెలిసిందే. ఒకే పార్టీ నుంచి ఇరువర్గాల నాయకులు అభ్యర్థులను నిలబెట్టి పోటాపోటీగా కార్యాలయాలను ప్రారంభించారు. ఇరువర్గాల నాయకులు పంతాలు, పట్టింపులకు పోతూ పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇరువర్గాల ఆధిపత్య పోరు వీధికెక్కింది.
రంగంలోకి దిగిన పార్టీ నాయకత్వం!
ఎంపీ కేశినేని, ఆయనకు వ్యతిరేకంగా ఏకమైన వర్గం మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ శృతి మించుతూ పార్టీకే నష్టం చేసే స్థాయికి చేరుకోవడంతో టీడీపీ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి అప్పగించింది. దీంతో అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం శ్రీకాకుళం నుంచి విజయవాడ చేరుకుని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడి నివాసంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో విభేదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగారు.ఆ ఇద్దరినీ పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రేపోమాపో ఎంపి కేశినేని నానిని కూడా ఆయన పిలిపించి మాట్లాడతారని,సాధ్యమైనంత త్వరగా ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన భావిస్తున్నారని టిడిపి వర్గాలు తెలిపాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?