Eetala Rajendar: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం.. కాంగ్రెస్లో కాక రేపింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరినీ సీఎం కేసీఆర్ కక్షగట్టి బయటకు గెంటేస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు ఈటలకు మద్దతుగా నిలిచారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ కుమార్తో పాటు చాలా మంది లీడర్లు ఈటల పక్షాన మాట్లాడారు. టీఆర్ఎస్లోని మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఆక్రమణలపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే, పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ,రాజేందర్ చేతిలో ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా గొంతెత్తారు.
Eetala Rajendar: రాజేందర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి
ఈటల పై కౌశిక్ రెడ్డి ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్లో చీలికకు కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కౌశిక్ రెడ్డి వరుస ప్రెస్మీట్లు పెట్టి ఈటల మీద భూకబ్జాలు, ఆక్రమణల ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ డైరెక్షన్లో పనిచేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.
కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు!
దీనిపై రెండ్రోజుల కిందట పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు కూడా చేశారు. ఇటు ఈటల వ్యవహారంపై పార్టీ వైఖరేంటో క్లారిటీ ఇవ్వాలంటూ ఉత్తమ్కూ లేఖ రాశారు. ఈటల విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు సరిగ్గా లేదని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ ఎజెండాతో మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై పార్టీ ముఖ్యులతో మీటింగ్ పెట్టి పార్టీ వైఖరిపై కార్యాచరణను వెల్లడించాలని కోరారు.కాగా ఉత్తమ్కు కౌశిక్ రెడ్డి దగ్గరి చుట్టం. దీంతో ఆయన అండతోనే కౌశిక్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని పార్టీలో బహిరంగ చర్చ జరుగుతోంది.