ఇప్పుడంటే మనం జియో పుణ్యమా అని దాదాపుగా 1 జీబీ ఇంటర్నెట్కు కేవలం రూ.4 వరకే ఖర్చు చేస్తున్నాం. ఇక బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు తీసుకుంటే ఇంతకన్నా తక్కువగానే ప్రస్తుతం1 జీబీ డేటాకు ఖర్చువుతోంది. అయితే ఒకప్పుడు.. అంటే. ఇండియాలో ఇంటర్నెట్ వచ్చిన తొలినాళ్లలో అందుకు చార్జీలను ఏ మేర వసూలు చేసేవారో తెలుసా..? ఆ విషయాలు తెలుసుకుంటే నిజంగానే షాక్కు గురవుతారు.
1995లో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్) దేశంలో తొలిసారిగా ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చింది. అప్పట్లో 5 కేటగిరిల్లో ఇంటర్నెట్ను అందించేవారు. ప్రొఫెషనల్స్, నాన్ కమర్షియల్, కమర్షియల్, ఎక్స్పోర్టర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అనే విభాగాల్లో ఇంటర్నెట్ను ఇచ్చారు. ప్రొఫెషనల్ కేటగిరిలో డయలప్ లైన్కు రూ.5వేలు, నాన్ కమర్షియల్కు రూ.15వేలు, కమర్షియల్కు రూ.25వేలు, ఎక్స్పోర్టర్స్కు రూ.20వేలు ఫీజు తీసుకునేవారు. స్పీడ్ కేవలం 9.6 కేబీపీఎస్ వచ్చేది.
ఇక ప్రొఫెషనల్స్ కాకుండా ఇతర కేటగిరిల వారికి 9.6 కేబీపీఎస్, 64, 128 కేపీబీఎస్ స్పీడ్లతో లీజ్డ్ లైన్ ఇచ్చేవారు. వాటికి రూ.2.40 లక్షల కనీస ఫీజు నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు వసూలు చేసేవారు. ఏడాదికి రూ.75వేలు చెల్లించి 9.6 కేబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ తీసుకుంటే ఏడాదికి 240 గంటల వరకు ఇంటర్నెట్ను వాడుకునేందుకు అనుమతి ఇచ్చేవారు. అంటే సుమారుగా రోజుకు 40 నిమిషాలు అన్నమాట. ఈ క్రమంలో అప్పట్లో ఇంటర్నెట్ కావాలంటే కనీసం రూ.15వేలు చెల్లించాల్సి వచ్చేది. అందులోనూ 9.6 కేబీపీఎస్ స్పీడ్ వచ్చేది. ఇప్పటితో పోలిస్తే అప్పుడు ఎంత తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేదో, అందుకు ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేసేవారో ఒక్కసారి లెక్క వేస్తేనే మనకు షాక్ కొడుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు ఇప్పుడు డర్ట్ చీప్ ధరలకే ఇంటర్నెట్ లభిస్తోంది.