త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా తప్పుకున్న విషయం విదితమే. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు రైనా తెలిపినా.. దుబాయ్లో సీఎస్కే టీం ఉన్న హోటల్లో తనకు కేటాయించిన గది బాగా లేనందువల్లే అతను ఐపీఎల్ ఆడకుండా తప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ కు దూరం కావడం వల్ల రైనా చాలా పెద్ద మొత్తాన్నే నష్టపోనున్నాడు.
సురేష్ రైనాకు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఒక సీజన్కు రూ.11 కోట్లు చెల్లిస్తోంది. దీంతోపాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ క్యాచ్ అవార్డులను సైతం రైనా మిస్ కానున్నాడు. వాటికి ఎంత లేదన్నా మరో రూ.4 కోట్ల వరకు వస్తాయి. దీంతో ఈసారి రైనా రూ.15 కోట్ల వరకు నష్టపోనున్నాడు. కాగా రైనాను మొదట సీఎస్కే 2008లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది .అప్పటి నుంచి ఆ జట్టులో అతను కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్లో పలు రికార్డులు కూడా అతని పేరిట ఉన్నాయి. జట్టును కీలక సమయాల్లో ఆదుకోవడంతోపాటు అవసరం అయితే బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో రైనాను కోల్పోవడం ఇప్పుడు సీఎస్కేకు పెద్ద మైనస్గా మారింది.
అయితే రైనా మళ్లీ ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నా.. సీఎస్కే తరఫున మాత్రం ఆడడని తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్లో అతన్ని సీఎస్కే వేలంలో పెడుతుందని సమాచారం. ప్రస్తుతం సీఎస్కే ధోనీకి రూ.15 కోట్ల అత్యధిక వేతనం ఇస్తోంది. తరువాతి స్థానంలో రైనానే ఉన్నాడు. అయితే రైనా తాను ఎందుకు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడో మరింత స్పష్టంగా వివరణ ఇస్తాడని తెలుస్తోంది.