ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వాక్సిన్ ను ప్రజలకు అందించారు. అయితే ఈ నెల 25న భారత్ లో ఈ కరోనా టీకాను విడుదల చేయుటకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత వెంటనే కరోనా టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే భారత్ ప్రభుత్వం ఇందుకోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, డిసెంబరు 25 నుంచి ఏపీ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తామని ట్వీట్ చేయటం తెలిసిందే. ఇంతకీ ఈ కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశ ఖజానా మీద ఎంత భారం పడనున్నదో తెలుసా?
దేశ జనాభా అధికంగా ఉండటంతో భారత్ కు మిగిలిన దేశాలలాగా కాకుండా ఒకేసారి మూడు నాలుగు కంపెనీల నుంచి వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలని భావిస్తున్నారు. మిగిలిన దేశాల లాగా కాకుండా భారత్ కు భారీ ఎత్తున వ్యాక్సిన్లను కొనుగోలుచేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించటం తమ లక్ష్యమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భారత్ బయోటెక్ తో పాటు మరో మూడు కంపెనీల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.
మొదటిగా కరోనా బారినపడి పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారట. ప్రపంచ దేశాల సమాఖ్య ప్రపంచంలోని పలు దేశాలకు ఉచితంగా టీకాలను సరఫరా చేయనుంది. ఈ నేపథ్యంలో 19 నుంచి 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు భారత్ కు అందనున్నాయి.
మిగిలిన వాక్సిన్ ల కొనుగోలు కోసం రూ.10వేల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం మీద కరోనా వ్యాక్సిన్ల కోసం రూ.25వేల కోట్లు మరియు రవాణా కోసం రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.