(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )
తిరుమల వెంకన్న ఆస్తులు ఎంతో తెలుసా? ట్రావెన్ కోర్ ఆలయం కంటే తిరుమల ధనికమా? ఎంత భూములు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? అనేది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. తిరుమల వెంకన్న కు ఉన్న ఆస్తులు ఎంతో ఒకసారి తెలుసుకుందాం రండి..
బోర్డు వచ్చాకే లెక్కలు
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఎందరో రాజులు శ్రీనివాసుడికి ఎన్నో కానుకలు, ఆస్తులను రాసిచ్చారు. అయితే రాజుల కాలంలో ఇచ్చిన ఆస్తులకు లెక్క పక్కా లేకపోవడంతో అవి నిరర్ధకమయ్యాయి. 1932 లో మహంతుల పాలన తర్వాత మొదటిసారి టీటీడీ పాలకమండలి ఏర్పడిన దగ్గర నుంచి స్వామి వారి ఆస్తులపై పర్యవేక్షణ, లెక్కలు మొదలయ్యాయి. ఇటీవల తిరుమల వెంకన్న నిరర్ధక ఆస్తుల ను వేలం వేసి వాటి ద్వారా వచ్చే రాబడిని తీసుకోవాలని టిటిడి భావించింది. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఆస్తులను ఎలా వేలం వేస్తారని ఇలా అనుకుంటూ పోతే టీటీడీ వెంకన్న ఆస్తులు ఏమి మిగలవు అంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. అయితే అసలు వెంకన్న కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? వున్న స్థిరాస్తుల ఎంత చరాస్తుల ఎంత అన్ని వివరాలు సగటు భక్తుడికి ఆసక్తి కలిగించాయి.
ఇవి ఆస్తులు
*వెంకన్న మొత్తం ఆస్తులు : 1128
*మొత్తం భూమి : 8808 ఎకరాల 89 సెంట్లు
*వ్యవసాయ ఆస్తులు : 233
* వ్యవసాయ భూమి : 2085 ఎకరాల 41 సెంట్లు
* వ్యవసేయేతర ఆస్తులు : 895
* వ్యవసాయేతర భూమి : 6003 ఎకరాల 48 సెంట్లు
1974 నుంచి ఆస్తులు అమ్ముతున్నారు
వైసీపీ పాలన లోనే టిటిడి ఆస్తులు అమ్ముతున్నారు అంటూ విపక్షాలు చేసిన యాగీ పూర్తిగా రాజకీయం. గత టీడీపీ హయాంలోనూ టిటిడి బోర్డు కొన్ని తీర్మానాలు చేసి ఆస్తులను అమ్మింది. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో లేక వాటిని కాపాడుకోలేక 1974 నుంచే ఆస్తులను అమ్ముతూ వస్తున్నారు. వచ్చిన డబ్బులు టీటీడీకి జమ చేస్తున్నారు. ఇదేమి కొత్తది కాదు. 1974 నుంచి 2014 వరకు టీటీడీ అమ్మిన ఆస్తులు 141. అమ్మేసిన భూమి 335 ఎకరాల 23 సెంట్లు. దీనిలో వ్యవసాయ భూమి 293 ఎకరాల 02 సెంట్లు. వ్యవసాయేతర భూమి 42 ఎకరాల 21 సెంట్లు. దీని వల్ల వచ్చిన ఆదాయం 6.13 కోట్లు. ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న ఆస్తులు 987. భూమి 7753 ఎకరాల 66 సెంట్లు. దీనిలో వ్యవసాయ ఆస్తులు : 172 అయితే వ్యవసాయ భూమి : 1792 ఎకరాల 39 సెంట్లు. వ్యవసాయేతర ఆస్తులు 815 ఉంటే భూమి 5961 ఎకరాల 27 సెంట్లు ఉంది.
చరిత్ర రాసిన బోర్డు
జగన్ బాబాయ్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న టీటీడీ పాలకమండలి చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని వెంకన్న ఆస్తులను బహిర్గతం చేసింది. టీటీడీ ఆప్తులు పై విడుదల చేసిన శ్వేత పత్రం నిజంగా అద్భుతం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఈ బోర్డు చేయని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించింది. ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్లస్ అయ్యేది. అయితే దీనిపై కనీసం ఒక ప్రెస్ మీట్ గాని, లేదా సోషల్ మీడియాలో టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆశిస్తూ ప్రమోషాన్ కానీ లేకపోవడం విశేషం. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం సైతం దీన్ని చర్చకు లేపేలా ప్రచారం కల్పించలేదు.