ATM: మనం ఏటీఎం కి వెళ్లి డబ్బులు డ్రా చేసేటప్పుడు కొన్ని సార్లు ఏటీఎంల నుంచి చిరిగిపోయిన నోట్లు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చాలా మంది వాటిని ఎవరు తీసుకోరు అని ఆందోళన చెందుతుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియచేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏటీఎంల నుంచి చిరిగిన లేదా మురికిగా మారిన చెల్లని నోట్లు ఉంటే డబ్బులు మార్పిడి చేసుకుని తిరిగి మంచి నోట్లను పొందవచ్చు.
ఈ డబ్బులను మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.ఏ బ్యాంకు శాఖలుఅయినా ఇలాంటి నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది.ఒక వేళా నోట్లు మార్పిడి చేయడానికి బ్యాంకు ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ బ్యాంకులు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ .10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఏటీఎంల నుంచి పాడైపోయిన,చిరిగిపోయిన నోట్లు వచ్చినట్లయితే వెంటనే, ఆ ఏటీఎం ఏ బ్యాంకుకు సంబంధించినదో ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెంటనే వెళ్లి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత డబ్బు డ్రా చేశారు అన్న విషయాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. విత్ డ్రా స్లిప్ ను కూడా దరఖాస్తుకు జత చేయవలిసి ఉంటుంది.ఒక వేళ మీరు రశీదు తీసుకోకపోతే లావాదేవీ యొక్క ఎస్ఎంఎస్ ను చూపించాలి .మీరు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్న తర్వాత సదరు బ్యాంకు మీకు ఆ చిరిగిన లేదా చెల్లని నోటు బదులుగా కొత్త కరెన్సీ నోటు ఇస్తుంది. ఈ ప్రక్రియ త్వరగా జరిగిపోతుంది. మీ డబ్బు మీరు తిరిగి పొందవచ్చు.