Nellore TDP: ఆవేశంలో ప్రతిజ్ఞలు చేయటం వేరు. దాన్ని ఆచరణలో పెట్టడం వేరు.బడారాజకీయ నేతలే ఇలాంటి విషయాల్లో మాటమీద నిలబడరు.ఉదాహరణకు అగ్ర నిర్మాత,అందరికీ తెలిసిన బండ్ల గణేష్ నే తీసుకుందాం.
కాంగ్రెస్ లో చేరి ఆ ఊపు మీదున్న సమయంలో బండ్ల గణేష్ 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాకుంటే తాను మెడ కోసుకుంటానని భీకర ప్రతిజ్ఞ చేశారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బండ్ల గణేష్ తూచ్ అన్నాడు.ఒక బండ్లగణేషే కాదు ..అనేక సందర్భాల్లో అన్ని పార్టీల నేతలు కూడా ఇలా సవాళ్లు విసరడం. తర్వాత సర్దుకోవటం మామూలే.కానీ ఒక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు మాత్రం ఎన్నికల సమయంలో తాను చేసిన సవాల్ కు కట్టుబడి అర గుండు,అర మీసం చేయించుకోవడం అత్యంత అరుదైన విషయం.రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Nellore TDP: చెప్పిందే చేసిన టిడిపి నేత శ్రీనివాస్
రెండు రోజుల క్రితం నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల్లో 49,50 డివిజన్ల టీడీపీ ఇన్చార్జిగా కప్పిర శ్రీనివాస్ వ్యవహరించారు.ఎన్నికల సమయంలో శ్రీనివాస్ ఈ రెండు డివిజన్లలో టీడీపీ కనుక ఓడిపోతే తాను అరగుండు, అరమీసం చేయించుకుంటానని సభాముఖంగా ప్రకటించారు.బుధవారం ఎన్నికల ఫలితాలు రాగా వైసిపి క్లీన్ స్వీప్ చేసింది.ఒక్క డివిజన్ కూడా వైసీపీకి దక్కలేదు.ఈ ఫలితాల అనంతరం ఆ జిల్లాలోని టిడిపి అగ్రనేతలే ముఖం చాటేశారు.కాని శ్రీనివాస్ మాత్రం మాట మీద నిలబడ్డారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటకే ఆయన అరగుండు, అరమీసం చేయించుకొని ప్రజల మధ్యకు వచ్చేశారు.ఈ రెండు డివిజన్లలో గెలవటానికి వైసిపి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆయన చెప్పారు.అయినా టిడిపి ఓడిపోయింది కాబట్టి తను అరగుండు, అరమీసం చేయించుకున్నట్లు తెలిపారు.అంతేగాక ఆయన ఈ సందర్బంగా ఇంకో ప్రతిజ్ఞ కూడా చేశారు.
జగన్ పోవాలి.. బాబు రావాలి..!
కాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు సర్కారు వచ్చే వరకు తాను అరగుండు అరమీసంతోనే ఉంటానని శ్రీనివాస్ ప్రకటించారు.జగన్ పోవాలి ..బాబు రావాలి అన్న నినాదం రాసిన పలకను మెడలో వేసుకొని ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు.సోషల్ మీడియాలో శ్రీనివాస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.టిడిపి పట్ల శ్రీనివాస్ కమిట్మెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు.జపాన్ సునామీ లో కూడా టిడిపి ఇంకా మనుగడ సాగిస్తోందంటే శ్రీనివాస్ లాంటి అంకితభావం ఉన్న నేతలే కారణమని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.