వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో తెలుగుదేశం పాలనలోని సంఘటనల సంగతి ఏంటి అనే ప్రశ్నను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో అంతా బాగుందని ఆయన చెప్పుకొచ్చారు.
వైసీపీ సర్కారులో…
వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు మండిపడ్డారు. “పిఠాపురంలో 6 దేవాలయాలలో 23 విగ్రహాలను ద్వంసం చేశారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో వెంకటేశ్వర స్వామీ రధాన్ని దగ్ధం చేశారు. అంతర్వేధిలో రధాన్ని కాల్చేశారు.
ఇన్ని సంఘటనలు జరిగినా ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయటం వైసీపీ కి అలవాటుగా మారింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైతే ఈఓ ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదు. నాలుగో సింహాన్ని లాగేదానికి ప్రయత్నించి రాకపోవడంతో వదిలిపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. “ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
జగన్, ఆ మంత్రిపై
దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్న తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉందని మండిపడ్డారు. “నీచంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. కేక వేస్తే వినపడే దూరంలో ఎండోమెంట్ రిజిస్ట్రార్ ఆలయం సమీపంలోనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు. నిడమానూరులో షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని ద్వంసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ భూములకు సంబంధించి 6 అక్రమాలు జరిగాయి. దేవాలయ ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి 9 అక్రమాలు జరిగాయి. ఆలయాల కూల్చివేతలు 12 జరిగాయి. అన్యమత ప్రచారాలు 13 జరిగాయి. అర్చకులపై వేదింపులు 2 జరిగాయి. గోశాలలో గోవులు చనిపోయిన సంఘటనలు 3 జరిగాయి. ఇలాంటివి మొత్తం దాదాపు 80 సంఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన సంస్కృతి, బాధ్యత పాలకులకు ఉండాలి. అలా కాకుండా నా ఇష్టానుసారం పరిపాలన చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. తిరగబడతారు. అన్ని మత సాంప్రదాయాలను సమానంగా కాపాడాల్సిన ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హిందూ దేవాలయాలపై 80 దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రికి ఇంకా పరిపాలించే అర్హత ఉందా?“ అంటూ విరుచుకుపడ్డారు.
అప్పట్లో… మా పాలనలో….
తెలుగుదేశం హయాంలో మత సామరస్యాన్ని కాపాడామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాలను సమానంగా చూశామని చంద్రబాబు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఒక చర్చిపై దాడి జరిగితే దానిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకున్నామన్నారు. 426 జీవోకు వ్యతిరేకంగా దేవాలయాలలో దుకాణాలను అన్యమతస్తులకు ఇస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వాటికన్ సిటీ, జెరూసలేంలలో అన్యమత ప్రచారం చేస్తే ఆ మత భక్తుల విశ్వాసాలు దెబ్బతినవా? అలానే హిందూ మత దేవాలయాలలో అన్యమత ప్రచారం చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినవా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. దేవాలయాలను చర్చీలను మనం కాపాడుకోలేకపోతే మనల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. వైసీపీ అరాచకాలపై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి. అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.