ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్న సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రతి చాన్స్ వినియోగించుకుంటోంది.
మరోవైపు టీడీపీని బుక్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఈ పర్వంలో తెరమీదకు వచ్చిందే ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం కేంద్రంగా తాజాగా కొత్త చర్చ జరుగుతోంది.
జగన్ ప్లాన్ ఇదేనా?
రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం తెరమీదకు రావడం కలకలం రేపింది. దీనిపై సహజంగానే టీడీపీపై అనుమానపు చూపులు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ ఎదరుదాడి మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని, దేవాలయాలపై, దళితులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి వాటిని నిలువరించడం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. చినరాజప్ప జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ సంవత్సరం 6నెలల నుంచీ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే, తాజాగా మరోసారి రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీ ఎమ్మెల్యే సంగతి ఏంటి జగన్?
ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతికి పేరు రాకూడదన్న దురుద్దేశంతో, చంద్రబాబుపై కక్షతోనే ఈ ప్రభుత్వం రాజధాని భూములపై విచారణ పేరుతో నాటకాలు మొదలు పెట్టిందని చినరాజప్ప ఆరోపించారు. సీఆర్డీఏ హద్దులకు అవతల ఉన్న భూములనుకూడా ప్రభుత్వం, రాజధాని భూములుగా చూపుతూ, టీడీపీపై బురదజల్లాలని చూస్తోందని చినరాజప్ప అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కూడా రాజధానిలో భూములు కొన్నాడని, వాటిగురించి మాత్రం ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదని అన్నారు. వైసీపీలోని పెద్ద తలకాయలు విశాఖలో పెద్దఎత్తున భూములు కొనుగోలుచేశారని, దానిపై విచారణకు ఆదేశించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని చినరాజప్ప నిలదీశారు.
ఆయన సైతం వచ్చేశారు
మరోవైపు ట్విట్టర్లో టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులపై దమనకాండ, దేవాలయాలపై దాడుల ఘటనల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి మరోసారి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాత పాట పాడుతోందని ఆరోపించారు. అమరావతిని శ్మశానం అన్నారు, మునిగిపోతుంది అన్నారు,ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు. 16 నెలల్లో ఒక్క ఆధారం చూపించలేని దద్దమ్మలు మళ్ళీ ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ హడావిడి మొదలెట్టారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి లో మొలిచిన గడ్డి పోచ కూడా పీకలేరని విరుచుకుపడ్డారు.
ఆధారాలతో దొరికిపోయారు
175 నియోజకవర్గాల్లో పేదవారికి ఇళ్ల స్థలాలు అంటూ 5 లక్షలు విలువ చేసే భూమిని 50 లక్షలకు కొని వైఎస్ఆర్ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు అంటూ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.