ఏపీలో ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆలోచన అంతా సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయం గురించే. అది మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతిలోనే రాజధాని కొనసాగింపు గురించి కాదు.
నామినేటెడ్ పదవుల గురించి. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇన్నాళ్లు శ్రమించిన నేతలకు ఇప్పుడు పదవులు దక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వైసీపీ నేతలను కాదని ఓ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పక్క పార్టీ నేతకు పదవులు ఇవ్వడం వివాదానికి కారణంగా మారుతోందని ప్రచారం జరుగుతోంది.
సహజంగానే తాము కష్టపడ్డ పార్టీ అధికారంలోకి వస్తే బడా నాయకుల నుంచి మొదలుకొని చోటా నేతల దాకా తమ తమ స్థాయిల్లో పదవులు ఆశిస్తారు. అధినాయకత్వం సైతం అదే విధంగా వారికి న్యాయం చేస్తుంది కూడా. చెప్పాలంటే చేయాలి కూడా. కానీ అధికార వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఇలా వైసీపీని కాదని బీఎస్పీ నేతకు ఓ పదవిని కట్టబెట్టనున్నారని సమాచారం.
సొంత పార్టీ నేతలను కాదని పక్క వారికి పదవి ఇవ్వడమే క్యాడర్ను బాధించే అంశమైతే మరిన్ని అంశాలు కూడా వైసీపీ శ్రేణుల ఆవేదనకు కారణమంటున్నారు. అదే వైసీపీ నేతలంతా ఆరాధించే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే నేతకు ఏకంగా కార్పొరేషన్ స్థాయి పదవి కట్టబెట్టడం. వైఎస్ను విమర్శించడమే కాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్ విధానాలను తప్పుపట్టే సదరు నియోజకవర్గ స్థాయి నేతకు వైసీపీ ఎమ్మెల్యే గారు ఇలా పట్టుబట్టి పదవి ఇప్పించడం ఏంటని వైసీపీ నేతలు వాపోతున్న పరిస్థితి. రాజకీయ వర్గాలు విస్మయం చెందుతున్న స్థితి. మరి ఈ చర్చకు కారణమైన ఎమ్మెల్యే గారి లెక్కేంటో.