‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం.
బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. సముద్రం పాలవుతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా.. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలు, నిరాధార ఫిర్యాదులు చేస్తోంది. అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా సమాధానం చెప్తాం.` ఇది ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆగ్రహం.
తెలంగాణ సీఎం కేసీఆర్ సహజంగానే కొంత సంయమన పాటిస్తారు. అనంతరం ఆయన చేసే విమర్శలు, ఆగ్రహ రూపం ఓ రేంజ్లోనే ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే, అన్నాదమ్ములు అన్నంత సఖ్యతతో కలిసిమెలసి రాజకీయం చేసిన ఏపీ సీఎం జగన్ విషయంలో కేసీఆర్ ఈ రేంజ్లో ఫైర్ అవడం వెనుక కారణం ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు. నీటి వాడకం విషయంలో ఏపీ సర్కారు వైఖరి అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఏపీ ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టంగా తమ వైఖరిని వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉన్నదని తెలిపారు. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నదని, నది ఎక్కువగా ప్రవహించేది తెలంగాణలోనేనని, ఇక్కడి అవసరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు.
అయితే, తెలంగాణ సీఎం ఈ రేంజ్లో వివరాలు వెల్లడించడం, అసహనం వ్యక్తం చేయడం వెనుక కారణం గతంలో జగన్ గురించి వేసిన అంచనా అంటున్నారు. సీఎం కుర్చీని కైవసం చేసుకుంటే చాలు అన్న భావనలో జగన్ ఉన్నారని, అనంతరం పెద్దగా తెలంగాణకు ఇబ్బందులు సృష్టించబోరని కేసీఆర్ భావించినట్లు సమాచారం. దీంతో గతంలో తను చర్చించిన సీనియర్ నేత చంద్రబాబు కంటే, తనకంటే జూనియర్ అయిన జగన్తో `డీల్` చేయడం ఈజీ అని కేసీఆర్ భావించినట్లు చెప్తున్నారు. అయితే, ఈ విషయంలో తేడా కొట్టేసిందని పేర్కొంటున్నారు. సీమ ప్రయోజనాల కోసం సీఎం జగన్ సిద్ధమవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో….గతంలో చంద్రబాబే ఒకింత బెటరేమో అన్న భావనకు తెలంగాణ సీఎం వచ్చి ఉంటారని చర్చ జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?