వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అంటే ఓ రేంజ్లో విరుచుకుపడే సంగతి తెలిసిందే.
వివిధ అంశాలు, నిర్ణయాల ఆధారంగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కొడాలి నాని టార్గెట్ చేస్తుంటారు. అయితే, తెలుగుదేశం శ్రేణులు సైతం అదే రీతిలో విరుచుకుపడుతుంటాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డిప్రెషన్లో కొడాలి నాని?
మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన చాలా డిప్రెషన్, ఫ్రస్టేషన్లో ఉన్నట్లుగా ఉందని దివ్యవాణి ఎద్దేవా చేశారు. రాజధాని రైతులు మంత్రి కొడాలి నాని శవయాత్ర చేయడంతో దాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు పై, రాజధాని మహిళలపై నోరు పారేసుకుంటున్నాడని టీడీపీ మహిళా నేత ఎద్దేవా చేశారు. భూములు కోల్పోయి, రాజధాని కోసం 268 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రాజధాని మహిళలను ఉద్దేశించి, అర్థరాత్రి రోడ్లపై తిరిగేవాళ్లంటూ మంత్రి కొడాలినాని అసభ్యంగా మాట్లాడటం సరికాదని దివ్యవాణి అన్నారు. “మంత్రి కొడాలి నానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా అలానే రాత్రిళ్లు తిరుగుతారా అని ఎవరైనా అంటే నాని పరిస్థితి ఏమిటి? నాని వల్ల వైసీపీకి అపకీర్తి కలుగుతోంది“ అని అన్నారు. నిక్కర్లు వేసే వయసు నుంచి చంద్రబాబుని చూస్తున్నానని చెబుతున్న నాని, ప్యాంట్లు వేసే టైమ్కు ఆయనిచ్చే టిక్కెట్ట్ కోసం ఎదరు చూశాడని దివ్య వాణి ఎద్దేవా చేశారు.
చిచ్చు పెట్టారు..
మంత్రి కొడాలి నాని, ఇతర వైసీపీ నేతలు తమ అధ్యక్షుడు చంద్రబాబుని దూషించినా, సీనియర్లను తిట్టినా కూడా మాటకు మాట అనడం చేతగాకే సంయమనం వహిస్తున్నారని దివ్యవాణి అన్నారు. మతి లేకుండా కొడాలినానీలా ఏదిపడితే అది అనడం చేతగాదని మాత్రం అనుకోవద్దు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వ తీరుకి నిరసనగా, ప్రజలే వైసీపీ ముఖంపై పేడనీళ్లు కొడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు నాయుడు రాజధానిలో పేదలకు కట్టించిన 5వేల ఇళ్లను వారికి ఇవ్వకుండా, వారిపై ప్రేమ ఉందని చెబితే ఎవరు నమ్ముతారు?సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుగా రైతులిచ్చిన భూములను పేదలకు పంచుతామనడానికి కొడాలి నాని ఎవరు? “ అని మండిపడ్డారు.
నువ్వో బచ్చావు నాని
రైతులకు, పేదలకు మధ్య గొడవలు పెట్టడానికే, వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ, కుట్రలు చేస్తోందని దివ్య వాణి ఆరోపించారు. “రైతులు 33వేల ఎకరాలిస్తే, రాజధాని నిర్మాణానికి ఒప్పుకుంటామని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు ప్రజల కన్నీళ్లను రక్తంలా మార్చి తాగుతున్నారు. చంద్రబాబుని లుచ్చా అంటున్న నాని ఆయన ముందు ఒక బాతుబచ్చా అని తెలుసుకుంటే సంతోషిస్తాం.“ అని అన్నారు. కాగా, మరో విలేకరుల సమావేశంలో టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ, నానీ లాంటి వారికి టిక్కెటు ఇచ్చి చట్ట సభలకు పంపినందుకు చంద్రబాబు బాధపడుతున్నాడని తెలిపారు.