తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో సీనియర్ మంత్రిగా ఉన్న తలసాని ఎందుకిలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ముఖ్యనేతగా ఉన్న ఆయన కరోనా విషయంలో లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
సిద్దిపేటలోనే ఇలా జరిగింది?
తాజాగా సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావుతో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కృత్రిమ గర్భధారణ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్లో విత్తన చేప పిల్లలను వదిలారు. గజ్వేల్లో టీఎన్జీవో భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎక్కడ కూడా మాస్క్ ధరించకపోవడం గమనార్హం. కాగా, బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంత బహిరంగంగా జరిగిన కార్యక్రమాల్లో మాస్కులు ధరించకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్న, టీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు సైతం మాస్కు ధరించారు. అయితే, పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న హైదరాబాద్లో నివసిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం.
తెలంగాణలో భారీగా కేసులు…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 1.11 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3018 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 780 కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో 95, జీహెచ్ఎంసి పరిధిలో 475, జగిత్యాలలో 100, కామారెడ్డిలో 76, కరీంనగర్ లో 127, ఖమ్మంలో 161, మహబూబాబాద్ లో 60, మంచిర్యాలలో 103, మేడ్చల్ లో 204, నల్గొండలో 190, నిజామాబాద్ జిల్లాలో 136, పెద్దపల్లిలో 85, రాజన్న సిరిసిల్లలో 69, రంగారెడ్డిలో 247, సిద్ధిపేటలో 88, సూర్యాపేటలో 67, వరంగల్ రూరల్ లో 61, వరంగల్ అర్బన్ లో 139 కేసులు నమోదయ్యాయి.