ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో సమకాల రాజకీయాలపై స్పందిస్తుండే సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు తాజాగా ఓ ఊహించని షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. అయితే ఈ హెచ్చరిక ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది.
ఆర్కేను ఓ రేంజ్లో కెలికారు కదా?
“మీ జీవీఎల్, మీ ఇష్టం“ అంటూ ఆంద్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ విశ్లేషణపై సోము వీర్రాజు ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. “ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి “మీ జీవీఎల్, మీ ఇష్టం” అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబు గారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.“ అంటూ ఆర్కేను ఓ రేంజ్లో కెలికారు.
అక్కడితోనే ఆపేయని వీర్రాజు…
ఇక్కడితో ఆపని వీర్రాజు ఇంకా తన టార్గెట్ను కొనసాగించారు. “ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. “ అంటూ తమ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నేరుగానే చెప్పేశారు వీర్రాజు.
వీర్రాజు ఆషామాషీగా అనలేదులేండి….
“అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగంగానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను.“ అంటూ మా విషయాల్లో మీకేం పని అంటూ సూటిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే, వీర్రాజు ఆషామాషీగా ఈ మాటలు అనలేదని అంటున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ విధంగా అటాక్ చేశారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.