ఆంధ్రప్రదేశ్లో బలపడాలని ప్రయత్నిస్తూ, అవకాశం దొరికితే అధికారం చేజిక్కించుకోవాలని ఆశ పడుతున్న భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో చాన్స్ ఇస్తోందా?
ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా జరిగే ఘటనలు, పలువురు నేతల కామెంట్లు దీనికి ఆజ్యం పోస్తున్నాయా? ఇప్పుడు ఈ చర్చ ఏపీలో హాట్ టాపిక్. ఏపీలో దేవాలయాలపై దాడుల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా మంత్రి కొడాలి నాని కామెంట్లు ఆజ్యం పోశాయి.
ఎందుకు అలాంటి మాటలు?
తిరుమల దేవాలయంలో డిక్లరేషన్, దేవాలయాల్లో దాడులు, వాటిపై ప్రచారం విషయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల తీరుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆంజనేయుడి విగ్రహానికి వినతిపత్రం అందించారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి వినతిపత్రం ఇస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో కొడాలిపై ఫిర్యాదు చేస్తామమన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన దేవుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
డిక్లరేషన్ విషయంలో
తిరుమలలో డిక్లరేషన్ అవసరం లేదంటూ మంత్రి కొడాలి నాని ప్రకటించడం ఏంటని ప్రశ్నించిన వీర్రాజు వెంకన్న ఏమైనా నానికి బావమరిదా… డిక్లరేషన్ ఎవరు పెట్టారు అంటారా ? అంటూ మండిపడ్డారు. ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఆయనకు నష్టమా, రధం దగ్ధం అయితే… కోటి రూపాయలతో చేపిస్తున్నారు కదా ఇంకేంటి సమస్య అనడం ఏంటి? ఇటువంటి వ్యాఖ్యలు ను బట్టి మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని వీర్రాజు పేర్కొన్నారు. దేవుడిపై మంత్రి కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా…రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి వినతిపత్రం ఇస్తామని వీర్రాజు ప్రకటించారు.
బీజేపీకి బూస్ట్ ఇస్తున్నారా?
వాస్తవంగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అందించే నిధుల విషయంలో, విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన వాటి విషయంలో జరుగుతున్న జాప్యం కేంద్రంగా బీజేపీ రాష్ట్ర నాయకులను ఏపీలోని అధికార పార్టీ నేతలు సులభంగా టార్గెట్ చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. కానీ అలాంటి అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా దేవాలయాల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం, జరిగిన సంఘటనల పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం, ముఖ్యంగా కొందరు నేతలు తమ దూకుడును సున్నితమైన అంశాల విషయంలోనూ కొనసాగించడం వల్ల వైసీపీకి నష్టం జరగడం, ఏపీలో బలపడాలని చూస్తున్న నేతలకు లాభం జరగడం ఖాయమని అంటున్నారు. దీనిపై వైసీపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి!