కరోనా మహమ్మారి సమయంలో వైరస్ బాధితులకు పారాసిటమాల్ 650 (డోలో 650) మాత్రలను సిఫార్సు చేసేందుకు గానూ వైద్యులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు తాయిలాల కు ఖర్చు చేశారన్న ఆరోపణలపై ఆ మందు ఉత్పత్తి సంస్థ మైక్రో ల్యాబ్స్ స్పందించింది.తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు పేర్కొన్నారు.కరోనా సమయంలో డోలో 650 మాత్రల మార్కెటింగ్ కోసం తాము వెయ్యి కోట్లు ఖర్చు చేశామ అనడంలో వాస్తవం లేదన్నారు గోవిందరాజు. ఎందుకంటే గత ఏడాది అత్యధికంగా అమ్మకం జరిగిన ఈ బ్రాండ్ ద్వారా తమకు రూ.350 కోట్లు వచ్చాయన్నారు. రూ.350 కోట్ల ఆదాయానికి వెయ్యి కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. తామే కాదు ఏ సంస్థ కూడా ఒక బ్రాండ్ కోసం అంత ఖర్చు చేయదని ఆయన తెలిపారు.
అంత మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా మార్కెటింగ్ కోసం చేసిన ఖర్చు
గత కొన్ని సంవత్సరాలుగా తాము మార్కెటింగ్ కోసం ఖర్చు చేసిన మొత్తం వెయ్యి కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు. దేశంలో డోలో 650 తో పాటు అన్ని రకాల పారాసిటమాల్ మాత్రల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. దశాబ్దానికి పైగా డోలో 650 విశ్వసనీయ బ్రాండ్ లీడర్ గా మార్కెట్ లో ఉందని తెలిపారు. కరోనా సమయంలో ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ ప్రకారం జ్వారాన్ని తగ్గించే ట్యాబ్లెట్ గా డోలో 650 మరింత ప్రాచుర్యం పొందిందని అన్నారు. కరోనా సమయంలో కేవలం డోలో 650 ట్యాబ్లెట్ మాత్రమే కాకుండా విటమిన్ సీ, జింక్ మాత్రలు విస్తృతంగా ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. తమ కంపెనీపై కేసు నమోదు అయినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని చెప్పారు. సుప్రీం కోర్టు లో దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఏదైనా వివరణ కోరితే ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సుప్రీం కోర్టులో డోలో 650 ఉత్పత్తి సంస్థపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డోలో 650 ట్యాబ్లెట్స్ రాసేందుకు వైద్యులకు రూ.వెయ్యి కోట్ల తాయిలాలను సంస్థ ఇచ్చిందనీ, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇది నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అభిప్రాయపడింది. పది రోజుల్లో తమ స్పందన తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వాస్తవానికి ప్రతి ఉత్పత్తి సంస్థ తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏటా కొంత బడ్జెట్ ను కేటాయిస్తుంటారు. అది కూడా వారికి వచ్చే లాభాల్లో పది నుండి 15 శాతం మాత్రమే రిప్రజెంటివ్ ల ద్వారా మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తుంటారు. సంస్థ ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే లాభాలను అధిగమించి మార్కెటింగ్ కోసం ఎవరూ ఖర్చు చేయరు. సుప్రీం విచారణలో ఈ వ్యవహరం ఎలా తేలుతుందో వేచి చూడాలి.
Dolo 650 టాబ్లెట్ హానికరమా? డాక్టర్లు లంచాలు తీసుకొని బలవంతంగా సజెస్ట్ చేస్తున్నారు?